మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనన్నప్పటికీ, అప్పుడప్పుడు ప్రెస్మీట్లు పెట్టి రాజకీయాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను వెలిబుచ్చుతుంటారు. ప్రెస్మీట్లో ఆయన ఫేవరెట్ సబ్జెక్ట్స్ మార్గదర్శి కేసు, రాష్ట్ర విభజన మొదలు పోలవరం డయాఫ్రామ్ వాల్వ్ వరకు అన్నిటి మీద తన జ్ఞానాన్ని ప్రజలకు ఉచితంగా పంచిపెడుతుంటారు. ఆయన తాజా ప్రెస్మీట్లో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు.
రాష్ట్ర విభజన అనేది ఓ షోరూమ్ విభజన వంటిదని దానిలో షోరూం తెలంగాణకు, ఖాళీ గోదాము ఏపీకి దక్కాయని అన్నారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడిగే సాహసం చేయలేకపోతున్నాయని అన్నారు.
పవన్ కళ్యాణ్పై మొదట్లో తనకు కొన్ని అంచనాలు ఉండేవని కానీ ఎప్పుడైతే ఆయన బిజెపితో పొత్తు పెట్టుకొన్నారో అప్పటి నుంచి ఆయన వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్కు ఏపీలో అభిమానులు చాలా మంది ఉన్నారు కనుక ఆయన వారాహి యాత్ర విజయవంతం అయ్యిందని, అయితే ఆయన పొత్తులపై అందరినీ అయోమయానికి గురి చేస్తున్నారని ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు.
మార్గదర్శి కేసు గురించి తాను 15 ఏళ్ళ క్రితం ఏమి చెప్పానో ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. మార్గదర్శి సంస్థ చట్టానికి అతీతం కాదనే విషయం గ్రహించాలని ఉండవల్లి హితవు పలికారు.
కేంద్ర ప్రభుత్వం తలుచుకొంటే పోలవరం డయాఫ్రామ్ వాల్వ్ దెబ్బ తినడానికి ఎవరు కారణమో తెలుసుకోలేదా?కానీ పట్టించుకోవడం లేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి బిల్లు కంటే ముందు దేశంలో ఆర్ధిక అసమానతలు తొలగించేందుకు గట్టిగా కృషి చేస్తే బాగుంటుందని ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. ఉమ్మడి పౌరస్మృతిపై వైసీపీ, టిడిపి, జనసేనలు తమ వైఖరిని ప్రకటించాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో మత రాజకీయాలు చేయడం సాధ్యం కాదనే విషయం బిజెపి గ్రహించిన్నట్లు లేదని ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు.
రాష్ట్ర రాజకీయాలలో అందరితో మంచి పరిచయాలు, పరపతి ఉన్న ఉండవల్లి అరుణ్కుమార్, ఏపీలో పరిస్థితులు చక్కదిద్దేందుకు తన వంతు ప్రయత్నాలు చేసి మాట్లాడి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ ఇల్లు తగులబడిపోతుంటే తాపీగా చుట్ట కాల్చుకొంటూ ‘అయ్యో తగలబడిపోతోందే’ అని బాధపడుతున్నట్లు అనిపిస్తుంది.
—



