పాపం జగన్‌… అందరూ దెప్పిపొడిచేవారే!

Big Satire On Jagan

వైసీపిని దాని అధినేత జగన్మోహన్‌ రెడ్డిని గట్టిగా సమర్ధించేందుకు ఏర్పాటు చేసుకున్న సొంత మీడియా ఇంతకాలం ఆయనకు శల్యసారధ్యం చేస్తూ విజయవంతంగా ఎన్నికలలో ఓడించి పెట్టింది.

ఇప్పుడు ఆస్తుల వివాదంలో ఏదో చెప్పబోయి ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడు, యుద్ధం, సిద్దం, ఓటమి అంటూ అనకూడని మాటలనేసింది.

ADVERTISEMENT

అది చూసి జనాలు నవ్వుకుంటుంటే, జగన్‌ భజన చేసే అనుకూల మీడియా కంటతడిపెడుతోంది. చెల్లితో ఆస్తుల వివాదంలో చిక్కుకున్న జగన్‌ ఒంటరి పోరాటం చేస్తుంటే, లక్షలు జీతాలు తీసుకుంటున్న సొంత మీడియా తెలివితక్కువగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఈ వ్యవహారంలో జగన్‌ చాలా న్యాయంగా, ధర్మంగా ఉన్నారని తెలిసి ఉన్నప్పటికీ ఆయనని శత్రువుల బారి నుంచి కాపాడుకునే విధంగా వ్యవహరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఈ వ్యవహారంలో ఆస్తుల లెక్కల కంటే జగన్‌ నీతి నిజాయితీ, ఆయన భావోద్వేగాలను సొంత మీడియా ప్రజలకు అర్దమయ్యేలా వివరించలేకపోతోందని బాధపడుతోంది.

షర్మిలకి మద్దతుగా విజయమ్మ లేఖ విడుదల చేసి జగన్‌ని కార్నర్ చేసినప్పుడు, సొంత మీడియా చేతులు ముడుచుకొని ప్రేక్షకపాత్ర పోషిస్తోందని జగన్‌ అనుకూల మీడియా బాధ పడుతోంది.

అయితే జగన్‌ సొంత మీడియాని విమర్శిస్తూనే, వైసీపి ఓ రాజకీయ పార్టీలా కాకుండా ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుస్తోందంటూ విమర్శించడం విశేషం.

వైసీపీలో ఉన్నవారు కూడా తమ పార్టీని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగానే భావిస్తున్నారు కనుక అందరూ లాభనష్టాల లెక్కలు మాత్రమే చూసుకుంటూ, పార్టీ, అధినేత ఏమైపోతే మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారని జగన్ అనుకూల మీడియా వైసీపీ పరిస్థితికి అద్దం పట్టింది.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, నేతలు ఎవరినీ జగన్ దగ్గరకు రానీయలేదు. ఖాతరు చేయలేదు. కనుక ఎవరూ ధైర్యం చేసి పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు సదరు జగన్ భజన మీడియా మాత్రం ధైర్యం చేసి పిల్లి మెడలో గంట కట్టేసింది.

జగన్‌కి సామాజిక స్పృహ లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. వివిద రంగాలకు చెందిన మేధావులతో తరచూ సమావేశమవుతూ తన పాలన గురించి వారి అభిప్రాయాలు తీసుకుంటూ, ఎప్పటికప్పుడు లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగి ఉంటే ఉండి ఉంటే నేడు జగన్‌కి ఈ దుస్తితి ఏర్పడేది కాదని తేల్చి చెప్పేసింది.

జగన్‌ కనీసం ప్రజల మద్యకు వెళ్ళి వారిని కలిసేందుకు కూడా ఇష్టపడకుండా తాడేపల్లి ప్యాలస్‌లోనే కూర్చుని నష్టపోయారని, ఇంకా అలాగే ఉన్నారని, ఇలాగే ఉంటే జగన్‌ ఒంటరిగా మిగిలిపోతారని హితవు చెప్పింది సదరు జగన్‌ అనుకూల మీడియా.

నిజానికి టిడిపి, జనసేన, వాటి అనుకూల మీడియా కూడా గత 5 ఏళ్ళుగా ఇదే చెపుతున్నాయి. కానీ జగన్‌ అహంభావం, అధికార మదంతో వాటి విమర్శలను తనకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలని భావించి ఎదురుదాడి చేస్తూ కాలక్షేపం చేశారు. ఆయనకు సొంత మీడియా కూడా తాళం వేసింది. ఇంకా వేస్తోంది.

జగన్‌కి అహంభావం ఉన్నందునే ఈవిదంగా వ్యవహరించారని అందరికీ తెలుసు. కనుక అహంభావంతో ఉన్న వ్యక్తిని ఎవరూ ఎన్నటికీ మార్చలేరు. అది సొంత మీడియా కావచ్చు… అనుకూల మీడియా కావచ్చు. కనుక మార్చే ప్రయత్నం చేసి ఆయన ఆగ్రహానికి గురికావడం కంటే భజన చేసి జీతాలు పుచ్చుకోవడమే మేలు కదా?

ADVERTISEMENT
Latest Stories