గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఆయన అనుచరులు లక్ష్మీపతి, శివరామ కృష్ణలకు కూడా రిమాండ్ విధించడంతో ముగ్గురినీ పోలీసులు విజయవాడ జైలుకి తరలించారు. తర్వాత కస్టడీ-బెయిల్ ప్రక్రియ గురించి అందరికీ తెలిసిందే. కనుక ఇప్పుడు ఆ చర్చ అనవసరం.
కానీ వైసీపీలో ఎవరూ ఊహించని విదంగా వంశీ అరెస్టు విషయంలో పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించడంతో అందరూ షాక్ అయ్యారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ తీసుకోవడంతో ఇక పోలీసులు ఆయనని టచ్ చేయలేరని భావించారు.
కానీ అదే కేసులో టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి, బెదిరించి పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసుని వాపసు తీసుకునేలా చేశారనే ఆరోపణతో పోలీసులు మరోకేసు నమోదు చేసి వంశీ తదితరులను అరెస్ట్ చేసి జైలుకి పంపి పెద్ద షాక్ ఇచ్చారు.
వైసీపీ అధినేత జగన్ ఎన్నడూ వంశీకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ వంశీ అరెస్టుతో హడావుడి చేస్తే కాస్త సానుభూతి లేదా రాజకీయ మైలేజ్ లభిస్తుందనే ఆలోచనతోనే వైసీపీ నేతలతో హడావుడి చేయించారు తప్ప నిజంగా ఆయనపై ప్రేమాభిమానలతో కాదని అందరికీ తెలుసు.
వంశీ పెంచి పోషిస్తున్న అనుచరులే తప్ప వైసీపీ కార్యకర్తలు ఎవరికీ ఆయనపై సదాభిప్రాయం లేదు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అంతటివాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించగలిగినప్పుడు, ఆయనకు మద్దతుగా తాము రోడ్లపైకి వస్తే ఏమవుతుందో ఆయన అనుచరులకు, వైసీపీ కార్యకర్తలకు బాగా తెలుసు.
అందుకే వంశీని అరెస్ట్ చేసినా విజయవాడ, గన్నవరంలో వైసీపీ కార్యకర్తల హడావుడి కనబడలేదు. రేపు కొడాలి నాని విషయంలో కూడా ఇలాగే జరుగవచ్చని ఇది సూచిస్తోంది.
వంశీ, కొడాలి నాని ఇద్దరూ టీడీపీని వీడి వైసీపీలో చేరినప్పుడు అందరూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడునే తప్పు పట్టారు. విమర్శించారు. కానీ వారిద్దరూ ఏ పార్టీలో ఉన్నా ప్రమాదమే అని గత 5 ఏళ్ళలో నిరూపించి చూపారు.
వైసీపీలో ఇటువంటి నేర చరిత్ర కలిగినవారే ఎక్కువ మంది ఉన్నందున అందరూ కలిసి ఓకే పడవలో ప్రయాణించగలుగుతున్నారని భావించవచ్చు. కనుక ఆనాడు వంశీ, కొడాలి నాని విషయంలో చంద్రబాబు నాయుడు సరిగ్గానే వ్యవహరించారని అర్దమవుతోంది.




