టిడిపి కూటమి ప్రభుత్వం ఎవరెవరిని అరెస్ట్ చేయబోతోందో తెలుసుకునేందుకు ‘రెడ్ బుక్’ చూడనవసరం లేదు. సామాన్య ప్రజలకు సైతం తెలుసు.
గత 5 ఏళ్ళలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్ వంటి పలువురు వైసీపి నేతలు నోటి దురదతో మాట్లాడిన మాటలు అందరూ విన్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటిపలువురు ఏమీ మాట్లాడకుండానే చేసిన అకృత్యాలను అందరూ చూశారు. కనుక వారిపై చర్యలు తప్పవని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ తెలుసు.
కానీ ఎవరెవరికి ఎప్పుడు ముహూర్తాలు పెడతారు?ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? అనేది మాత్రమే ఇంకా తెలియవలసి ఉంది.
ఇప్పటికే పిన్నెల్లిని జైలుకి పంపగా, జగన్మోహన్ రెడ్డిపై రఘురామ కృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వల్లభనేని వంశీ అరెస్టుకి ముహూర్తం దగ్గర పడింది. గన్నవరంలో టిడిపి కార్యాలయం దాడి ఘటనలో ఇప్పటికే ఆయన అనుచరులలో 18మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత వల్లభనేని వంశీ వంతే.
ఆయన కోసం మూడు పోలీస్ బృందాలు గురువారం హైదరాబాద్ వెళ్ళాయి. ఒకవేళ అక్కడే ఉండి ఉంటే ఆయనకు నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మనమని ఆదేశించవచ్చు లేదా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆయన ‘గ్రీన్ కార్డ్’ సంపాదించుకొని అమెరికాలో స్థిరపడేందుకు భారీ పెట్టుబడి పెట్టిన్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక ఇంకా హైదరాబాద్లోనే ఉన్నారా లేక అమెరికా వెళ్ళిపోయారా?అనేది నేడు తెలుస్తుంది.
అయితే టిడిపిలో అందరి ‘ఫేవరెట్’ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానియే. “నేను ఈ కేసులకి భయపడి ఎక్కడికీ పారిపోయే ప్రసక్తే లేదు. ఇక్కడే గుడివాడలోనే ఉంటాను,” అని ధైర్యంగా ఆయన చెప్పి పోలీసులకు ఇబ్బంది తప్పించారు. కనుక నారా లోకేష్దే ఆలస్యం. ఆయనకు ఎప్పుడు ముహూర్తం పెడతారో?




