ఇది వంశీ పేరుగల క్రికెటర్ గురించి కాదు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించే. ఆయన ఫిబ్రవరి 13న అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి జ్యూడిషియల్ రిమాండ్ మీద విజయవాడ జైల్లోనే ఉంటున్నారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ఎన్నిసార్లు పిటిషన్ వేస్తున్నా న్యాయస్థానాలు తిరస్కరిస్తూనే ఉన్నాయి.
తాజాగా మంగళవారం విజయవాడ కోర్టు మరోసారి వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో పోలీసులు మళ్ళీ ఆయనని కోర్టు నుంచి జైలుకి తరలించారు. ఈ కేసు తదుపరి విచారణని మే 13కి వాయిదా పడింది. అంటే ముచ్చటగా మూడు నెలలు అంటే వంద రోజులు జైల్లో పూర్తి చేసుకోబోతున్నారన్న మాట! కనుక వల్లభనేని వంశీ ‘సెంచరీ బట్ నాటవుట్’ అని చెప్పుకోక తప్పడం లేదు.
వైసీపీలో ఉన్న నాయకులు తమ విశ్వసనీయత నిరూపించుకునేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను దూషించడం ,అవహేళన చేయడటం తప్పనిసరి అని ఆ పార్టీని వీడి వచ్చినవారే చెపుతున్నారు.
బహుశః వంశీ కూడా అలాగే అధినేత జగన్ని మెప్పించేందుకు, తన అనుచరుల చేత 2023, ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేయించారు.
చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు, వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే కాక బయట పార్క్ చేసి ఉన్న టీడీపీ నేతల కార్లకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధం అనే కంప్యూటర్ ఆపరేటర్ని కులం పేరుతో దూషిస్తూ, దాడి చేసి గాయపరిచారు.
కానీ అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నందున ఆయన పిర్యాదుని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నమోదు చేసి, వల్లభనేని వంశీని ఏ-1 ముద్దాయిగా పేర్కొన్నారు.
ఆ కేసు నుంచి బయట పడేందుకు వల్లభనేని వంశీ, అనుచరులతో కలిసి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి ఆ కేసుని ఉపసంహరించుకునేలా చేశారు. కానీ అతనిని కిడ్నాప్ చేసినందుకుగాను వల్లభనేని వంశీ కొత్త కేసులో చిక్కుకొని జైలు పాలయ్యారు.
ఇది కిడ్నాప్ కేసుకి సంబందించిన రిమాండ్ మాత్రమే. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నుంచి వల్లభనేని వంశీ తెలివిగా తప్పించుకోవాలనుకుంటే, ఈ కిడ్నాప్ కేసుతో దానికి బలమైన పునాది వేసుకుని అడ్డంగా బుక్ అయిపోయారు.




