టిడిపి మహిళానేతలలో వంగలపూడి అనిత శైలి చాలా భిన్నమైనది. ఆమె దేని గురించి మాట్లాడినా పూర్తి అవగాహనతో సాధికారంగా మాట్లాడుతుంటారు. తాజాగా ఆమె ఏపీ సిఎం జగన్ తీరుపై చాలా నిశితంగా విమర్శలు గుప్పించారు.
“జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక హడావుడిగా ఫైల్స్ మీద సంతకాలు పెట్టేసి పనులు చేసేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ, ఐటి కంపెనీ, ఒక్క ఉద్యోగం రాకపోగా చంద్రబాబు నాయుడు హాయంలో తెచ్చినవి, రాష్ట్రానికి ఇంకా రావలసినవి కూడా రాకుండా పారిపోయాయి. కనీసం వాటిలో ఓ నాలుగైదు కంపెనీలను జగన్ ప్రభుత్వం నిలబెట్టుకొని ఉన్నా వాటి వలన ఏపీలో కనీసం లక్షమందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవి. కానీ వాటిలో ఏ ఒక్క దానినీ రాష్ట్రంలో ఉండనీయకుండా తరిమేస్తే, వారు పొరుగు రాష్ట్రానికి పోయి పరిశ్రమలు స్థాపిస్తున్నారు. అప్పుడు ఏపీలో నిరుద్యోగులు పొట్ట చేత్తో పట్టుకొని ఆ ఆ రాష్ట్రానికి వలసలు వెళ్ళి వాటిలోనే పనిచేస్తున్నారు. ఇందుకు జగన్ ప్రభుత్వం ఏమాత్రం సిగ్గుపడటం లేదు కూడా.
కానీ హామీలు ఇచ్చి, ఫైల్స్ మీద సంతకాలు పెట్టినంత మాత్రాన్న రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావని గ్రహించేందుకు జగన్ ప్రభుత్వానికి నాలుగేళ్ళు పట్టింది. అందుకే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుంటే టిడిపి హయాంలో శంకుస్థాపన చేసిన వాటికే మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు చేస్తూ, అభివృద్ధికి శ్రీకారం చుట్టామని నిసిగ్గుగా గొప్పలు చెప్పుకొంటున్నారు.
ఇక ఈ పిట్టలదొర, ఆయన మంత్రులు తాము ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కాకుండా, ఇవ్వనివి కూడా చాలా చేస్తున్నామని చెప్పుకొంటారు. నిజమే… మేము అధికారంలోకి వస్తే చెత్త పన్ను వేస్తామని, కరెంట్, బస్సు చార్జీలు పెంచుతామని, ఇంటిపన్ను పెంచుతామని జగనన్న ఏనాడూ చెప్పలేదు. కానీ అన్నిటినీ ఎడాపెడా పెంచేస్తున్నారు కదా?కనుక జగన్ మాటలకు అర్దాలే కాదు పరమార్ధాలు కూడా వేరేగా ఉంటాయని ప్రజలు గ్రహించాలి,” అని వ్యంగ్యంగా అన్నారు.



