విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కేటాయింపు విషయంలో గుస్సా అయిన వంగవీటి రాధా, మరో రెండు, మూడు రోజుల్లో తన భవిష్యత్తు కార్యకలాపాలను ప్రకటించబోతున్నారు. గత ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన మల్లాది విష్ణుకు అధిక ప్రాధాన్యతనిస్తూ సెంట్రల్ నియోజకవర్గం అతనికి కేటాయించడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని ‘రాధా అండ్ కో,’ గడిచిన రెండు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తోంది.
[m9ad]
అయితే విజయవాడ తూర్పులో గతంలో రాధా గెలిచారని, అందుకే అక్కడ గానీ, లేదంటే మచిలీపట్నం ఎంపీ సీటును గానీ జగన్ ఇవ్వాలనుకుంటున్నారని అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ మరింత మంటేక్కించాయి. సెంట్రల్ లో రాధా బరిలోకి దిగితే ఓడిపోతారన్న విషయాన్ని ఈ సందర్భంగా అంబటి రాంబాబు పరోక్షంగా వెల్లడించారు. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాధా, ప్రస్తుతానికి పార్టీలోనే ఉన్నానని, మరో మూడు రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు.
‘జగన్ అండ్ కో’ తీసుకున్న నిర్ణయం ‘వంగవీటి ఈగో’ను హర్ట్ చేయడంతో, పార్టీ మారడం అనివార్యంలా కనపడుతోంది. ప్రత్యామ్నాయంగా ఒక్క జనసేన తప్ప రాధాకు మరో పార్టీ కనిపించడం లేదు. పవన్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు, గతంలో పవన్ తో సాన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో, జనసేనలోకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రతి ఎలక్షన్ ముందు పార్టీ మార్పులు రాధాకు పరిపాటిగా మారిపోయింది.



