శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు ఓ సినిమా చేయాల్సి ఉన్న మాట అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కమ్ముల తీస్తున్న “ఫిదా” సినిమానే ప్రిన్స్ తో చేయాల్సి ఉంది. ఈ సినిమా కధ విన్న తర్వాత మహేష్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించడంతో, ప్రిన్స్ – శేఖర్ ల కాంభినేషన్ పట్టాలెక్కుతుందని అంతా భావించారు. అయితే ప్రిన్స్ ఇచ్చిన టైంలో శేఖర్ సినిమాను పూర్తి చేయలేనన్న కారణంగా, ఇది మహేష్ నుండి మెగా హీరో వరుణ్ తేజ్ చెంతకు చేరింది.
అయితే ఈ మార్గమధ్యంలో “ఫిదా” మరో హీరోను కూడా టచ్ చేసిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘మిస్టర్’ సినిమా విడుదల నేపధ్యంలో ఇంటర్వ్యూలు ఇచ్చిన వరుణ్, ముందుగా ‘ఫిదా’ కధ రామ్ చరణ్ వద్దకు వెళ్లిందని, చెర్రీ కూడా ఈ సినిమాను చేసేందుకు ఒప్పుకున్నారని తెలిపారు. అయితే ఒక రోజు శేఖర్ కమ్ముల వచ్చి, ‘ఫిదా’ కధ చెప్తుంటే, ఇది చెర్రీ చేస్తున్నాడు కదా అని ఫోన్ చేయగా, ‘నాకు కుదరడం లేదు, నువ్వు ఓకే చేసావా?’ అని అడిగారు.
అప్పటికి స్టోరీ విన్న తాను శేఖర్ కమ్ములకు ఓకే చెప్పేసానని, ఆ సంగతే రామ్ చరణ్ కు చెప్పగా, ‘మంచి సినిమా అవుతుందని’ చెప్పాడని ‘ఫిదా’ ట్విస్ట్ రివీల్ చేసాడు వరుణ్. అంటే బయట ప్రపంచానికి తెలిసినంత వరకు మహేష్, రామ్ చరణ్ ల నుండి ‘ఫిదా’ చేతులు మారింది కానీ, ఈ జాబితాలో ఇంకెంత మంది హీరోలు ఉన్నారో అన్న అనుమానం సగటు సినీ ప్రేక్షకుడికి రాక మానదు. మరి ఇంతమంది టాప్ హీరోలు మిస్ చేసుకున్న ఆ “ఫిదా” ఎలా ఉందో తెలియాలంటే, ఈ ఏడాది సెకండాఫ్ వరకు వెయిట్ చేయాల్సిందే!



