వేడుకలపై విక్టరీ వెంకటేష్ సుదీర్ఘ ప్రసంగాలు చేయడం బహు అరుదు. అయితే అలా ఎలాంటి సుదీర్ఘ ప్రసంగాలు చేయకుండా 30 ఏళ్ళు గడిపేయడం విశేషం. వెంకీకి కూడా ఇదే రకమైన భావనను ‘బాబు బంగారం’ ఆడియో వేడుక పైన వ్యక్తపరిచారు. 30 సంవత్సరాలు అలా గడిచిపోయాయి అని చెప్పిన వెంకీ, ఈ రోజు స్పీచ్ ఇవ్వడానికి ప్రిపేర్ అయి వచ్చారా ఎవరో తనను అడిగారని… అయితే నిజాయితీగా చెప్పాలంటే… అలా స్పీచ్ లు ప్రిపేర్ అయి వచ్చి ప్రసంగాలు ఇచ్చే వాడు వెంకటేష్ కాదు… అని వెంకీ చెప్పగానే అభిమానులు చప్పట్లతో అభివాదాలు చేసారు.
30 ఏళ్ళుగా నేను స్టేజ్ ఎక్కి ఏమీ పీకలేకలేదు… వెళ్లి ఇప్పుడేమి పీకుతానయ్యా స్టేజ్ మీద… అని చెప్పానని… అయితే ఆడియో వేడుకలకు తానూ వచ్చేది మీ కోసమేనని, మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమేనని… అభిమానులను ఉద్దేశించి వెంకీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపాయి. అసలే మాటలు రావు… మీరు అరిస్తే ఎలా మాట్లాడగలను… 30 ఏళ్ళుగా వెండితెర మీద ఏదొకటి ట్రై చేస్తున్నాను, స్టేజ్ మీద మాత్రం అలవాటు కాలేదు అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు వెంకీ.
‘బాబు బంగారం’ సినిమాతో మారుతీ తనను మరో పది, పదిహేనేళ్ళు వెనక్కి తీసుకువెళ్ళాడని, సినిమా బాగా వచ్చిందని, ఈ సినిమా తర్వాత నన్ను ‘పెళ్లి కాని ప్రసాద్’ అని పిలుస్తారో, ‘బాబు బంగారం’ అని పిలుస్తారో చూడాలని అన్నారు విక్టరీ. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరో పదేళ్ళు, ఇరవై ఏళ్ళు సినిమాలు చేస్తూనే ఉంటానని, ఈ సందర్భంగా 30 సంవత్సరాలుగా తనను ఆదరిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్తున్నానని, ఇక మాటలు రావడం లేదు… ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ముగించారు విక్టరీ వెంకటేష్.



