
ఆంధ్ర ప్రదేశ్లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలు జగన్ ఎంతగానో ద్వేషించే కూటమికి దక్కుతుండటం దేవుడి స్క్రిప్ట్ అనే అనుకోవాలి. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే, జగన్ని నమ్ముకున్నవారందరూ ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, జగన్ బాధితులందరూ ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు.
జగన్ ఎంతగానో ద్వేషించే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికాగా, కింజారపు అచ్చన్నాయుడు, నారా లోకేష్ మంత్రులయ్యారు.
Also Read – జగన్ గుర్తించలేని మెగాస్టార్ని బ్రిటన్ గుర్తించింది!
జగన్ వేధింపులకు గురైన అయ్యన్న పాత్రుడు శాసనసభ స్పీకర్ కాగా, చిత్రహింసలు అనుభవించిన రఘురామ కృష్ణరాజు, ఉండి ఎమ్మెల్యే, డెప్యూటీ స్పీకర్ అయ్యారు. తీవ్ర అవహేళనలకు గురైన వంగలపూడి అనిత ఏకంగా రాష్ట్ర హోంమంత్రి అయ్యారు.
బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ, కృష్ణయ్య ముగ్గురు వైసీపీ రాజ్యసభ్యులు రాజీనామాలు చేయడం వైసీపీకి ఓ నష్టం అనుకుంటే ఇప్పుడు ఆ మూడు సీట్లు జగన్ ఎంతగానో ద్వేషించే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల చేతికి చిక్కుతున్నాయి.
Also Read – ఆంధ్ర అంటే ఇంకా నామోషీయేనా కేటీఆర్జీ?
వాటిలో ఒకటి టీడీపీ, మరొకటి జనసేనకు ఖాయమనే భావించవచ్చు. పొత్తు ధర్మం పాటించి మూడో సీటు బీజేపికి ఇచ్చే అవకాశం ఉంది. బీజేపికి ఓ సీటు కేటాయిస్తే సోము వీర్రాజు మొదలు చాలా మంది సీనియర్లున్నారు.
టీడీపీలో అనేకమంది సీనియర్లున్నారు. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?
లోక్ సభ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు బిజేపీ కోసం వదులుకున్నారు. కనుక నాగబాబుకి రాజ్యసభ సీటు ఖాయమనే భావిస్తున్నారు. జగన్ బాధితులలో ఒకరైన నాగబాబుకి కూడా రాజ్యసభ సీటు లభిస్తే, ఏపీ రాజకీయాలలో ఇదో కొత్త సెంటిమెంట్గా మారే అవకాశం ఉంటుంది.
మరో విషయం ఏమిటంటే, వైసీపీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు తగ్గిపోగా, కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు పెరుగుతారు. కనుక కేంద్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం ఇంకా పెరుగుతుంది.
ఇదివరకు వైసీపీ ఎంపీలు ఢిల్లీలో తమ అధినేత జగన్ కేసులు, తమ కాంట్రాక్టులు, వ్యాపారాల కోసం లాబీయింగ్తోనే కాలక్షేపం చేసేవారు. కానీ కూటమి ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఏపీకి భారీగా ప్రాజెక్టులు సాధించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. కనుక కూటమి ఎంపీల సంఖ్య ఎంత పెరిగితే అంత ఏపీకి లాభమే.