తమిళనాడులో బొటాబొటి మెజార్టీతో టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత బలనిరూపణ సమయంలో 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పార్టీపై తిరుగుబాటు చేసి, విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వంటి అనేక నాటకీయ పరిమాణాలు జరిగాయి.
విజయ్ ప్రభుత్వం ఏర్పడి 15 రోజులైంది. ఆరు నెలల వరకు దాని జోలికి వెళ్ళనని చెప్పిన మాజీ సిఎం స్టాలిన్, త్వరలో ప్రభుత్వం కూలిపోతుందని ఒకసారి, రెండేళ్ళ కంటే ఎక్కువ నిలబడలేదని మరొకసారి హెచ్చరిస్తుండటంతో సిఎం విజయ్ కూడా అప్రమత్తమయినట్లే ఉన్నారు.
ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న25 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు నేడు తమ పదవులకు రాజీనామాలు చేయగా స్పీకర్ వాటిని వెంటనే ఆమోదించారు. రాజీనామాలు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు వెంటనే టీవీకే పార్టీలో చేరిపోయారు.
బయట మద్దతు ఎప్పటికైనా ప్రమాదమే కనుక వారిని రాజీనామాలు చేసి పార్టీలో చేరితే ఉప ఎన్నికలలో టికెట్స్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత తనదేనని సిఎం విజయ్ వారికి హామీ ఇచ్చి ఉండవచ్చు.
ఒకవేళ వారికి మళ్ళీ టికెట్స్ ఇవ్వకపోతే తగిన పదవి, ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది. లేకుంటే ఎవరూ సిఎం విజయ్ కోసం ఊరికే ఎమ్మెల్యే పదవులు వదులుకోరు కదా?
వారి రాజీనామాలకు 24 గంటల ముందే టీవీకే ప్రభుత్వం రాష్ట్రంలో కార్పోరేషన్ బ్యాంకులలో రూ.50,000 చొప్పున రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.
తద్వారా సిఎం విజయ్ ప్రజల అభిమానం, సానుభూతి సంపాదించుకొని తన ప్రభుత్వానికి రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నారని చెప్పవచ్చు.
బహుశః ఈ ధైర్యంతోనే ముగ్గురు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారేమో?
కానీ ఒకవేళ ఈ ఉప ఎన్నికలలో టీవీకే పార్టీ ఓడిపోయి, డీఎంకే పార్టీ దాని మిత్ర పక్షాలు మూడు సీట్లు గెలుచుకుంటే? విజయ్ ప్రభుత్వం బలం కాస్త తగ్గుతుంది. ఈ రిస్క్ ఉంటుంది కనుకనే మొదట ముగ్గురిని మాత్రమే రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళుతున్నారేమో? ముగ్గురూ గెలిస్తే మిగిలినవారి చేత కూడా రెండు మూడు విడతలలో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళవచ్చు.
ఏది ఏమైనప్పటికీ, విజయ్ ప్రభుత్వం ఏర్పడిన 15 రోజులకే ఇటువంటి అనూహ్య రాజకీయ పరిణామాలు జరుగుతుండటం విశేషమే కదా?




