ఎన్డీఏ నుండి తెలుగుదేశం పార్టీని బయటకు పంపించి, ఆ స్థానంలో వైసీపీ కూర్చోవాలని గడిచిన నాలుగేళ్ళుగా ‘జగన్ అండ్ కో’ చేసిన ప్రయత్నాలు తెలియనవి కావు. ఆ వైసీపీని నమ్మే, పక్కన ఉన్న టిడిపిని ‘పొమ్మనక పొగపెట్టినట్లు’ వ్యవహరించిన బిజెపి, విజయవంతంగా ‘చంద్రబాబు అండ్ కో’ను బయటకు పంపేలా చేసింది. ఇంకా పూర్తిగా ఎన్డీఏ నుండి వైదొలగనప్పటికీ, కేంద్రమంత్రుల రాజీనామాతో ఈ విషయం స్పష్టమైంది. దీంతో తదుపరి అవకాశం తమకేనని ‘వైసీపీ అండ్ కో’ సంకలు గుద్దుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
‘స్పెషల్ స్టేటస్’ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ను దగా చేసిన బిజెపికే తమ మద్దతు అని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారంటే… ఏ స్థాయిలో తెరవెనుక రాజకీయాలు నడిచాయో అర్ధం చేసుకోవచ్చు. జాతీయ మీడియా ఛానల్ ‘ఇండియా టుడే’ చేసిన ఓ చర్చలో పాల్గొన్న ‘ఏ2’ విజయసాయిరెడ్డి ఈ దిశగా కీలక వ్యాఖ్యలు చేసారు. తాము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ‘ఏపీ ప్రత్యేక హోదా’ పైనే అని చెప్తోన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తాము విశ్వసించబోమని అన్న సాయి, మోడీపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు.
‘హోదా ఇస్తామన్న వారితో కలిసి నడుస్తాం’ అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ… ‘హోదా ఇక సాధ్యం కాదని’ తేల్చిచెప్పిన బిజెపిని సమర్ధించడం…. వైసీపీ అవకాశవాద రాజకీయాలకు అద్దం పడుతోంది. ‘ఇక జగన్ పై కేసులన్నీ మాఫీ అంటూ’ ఇప్పటికే ఢిల్లీ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో… వైసీపీ జగన్ తర్వాత జగన్ గా పేరుగాంచిన విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇంత చెప్పిన విజయసాయి, బిజెపిపై అవిశ్వాసం మాత్రం పెట్టి తీరుతామని అంటున్నారు.
వైసీపీ తీరు ఒక్క విషయమైతే స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజానీకాన్ని ఒక ‘ట్రాప్’లో పడేయడానికి నాడు కాంగ్రెస్ + జగన్ లు ఏ విధంగా అయితే కుట్రలు, కుతంత్రాలు పన్ని విఫలమయ్యారో… అయిదేళ్ళ తర్వాత కూడా సరిగ్గా అలాంటి ప్రయత్నాలనే మళ్ళీ బిజెపి + జగన్ లు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు సార్లు ‘జగన్’ అన్న పేరు మాత్రం కామన్. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి జాతీయ పార్టీలతో కలిసి ఏపీ ప్రజలను దగా చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారనేది ప్రత్యర్ధి వర్గాల మాటలు.



