జగన్మోహన్ రెడ్డి విదేశంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీని, ఎంపీ పదవికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది.
వైసీపీ లేదా మరో పార్టీలో ఓ సీనియర్ నాయకుడు బయటకుపోతే ఇంత చర్చ జరగదు. కానీ విజయసాయి రెడ్డి రాజీనామాపై చాలా చర్చ జరిగింది.
జగన్ అక్రమాస్థుల కేసులు మొదలు వైసీపీ రాజకీయాలు, అవినీతి, ఆరాచకాలు, అక్రమాలు ప్రతీ దానిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విజయసాయి రెడ్డి ప్రమేయం ఉంది గనుకనే.
అంటే జగన్ నీడ విడిచిపెట్టి పోయిందన్న మాట! ఒక మనిషి చనిపోయినప్పుడే ఆత్మ విడిచిపెట్టిపోటుంది. కనుక వైసీపీకి ఇది మృత్యువుతో సమానం. అందుకే రాజకీయ విశ్లేషకులు దీనిపై అనేక కోణాలలో విశ్లేషించారు.
ఇది వైసీపీపై తీవ్ర ప్రభావం చూపబోతోందని వైసీపీ భావిస్తోంది కనుకనే ఆయన రాజీనామాపై వైసీపీలో సీనియర్ నేతలు ఎవరూ స్పందించలేదు.
కానీ ఆయన రాజీనామాపై ఇంతగా చర్చ జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండిపోతే పార్టీ శ్రేణులకు, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి. కనుక ఆయన రాజీనామా చాలా సాధారణ విషయమే అన్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించారు.
“వైసీపీలో ఓకే ఒక్క మెయిన్ వికెట్ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి. మిగిలిన వికెట్స్ ఎన్ని పడిన పార్టీకి ఎటువంటి ఇబ్బందీ లేదు. రాజకీయపార్టీలలో రాజీనామాలు సర్వసాధారణం.
వైసీపీ, టీడీపీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నైతిక విలువలు లేని ఇటువంటి నేతలు ఎంతో మంది పార్టీలని వీడిపోయారు. అంత మాత్రాన్న పార్టీలు మూతబడ్డాయా? లేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చాయి కదా?” అన్నారు.
ఇటువంటప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాగే స్పందిస్తుంది. కనుక అంబటి ఈవిదంగా సర్ధిచెప్పుకోవడం మామూలే.
కానీ ఆయన విషయంలో వైసీపీ ఎప్పటికీ ఇలాగే మౌనంగా ఉండిపోతుందా?అంటే కానే కాదని వైఎస్ షర్మిలతో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే అర్దమవుతుంది.
I am happy to share that I have embarked on a fresh approach to my horticulture operations. pic.twitter.com/q2Gq5UNGgN
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 27, 2025
విజయసాయి రెడ్డి వలన పార్టీకి, ముఖ్యంగా కేసుల వలన జగన్కి ఎటువంటి నష్టం, ప్రమాదం జరగనంత కాలం వైసీపీ ఆయన జోలికి వెళ్ళదు. కానీ నోరు విప్పితే ఆయనకీ వైఎస్ షర్మిలకు ఇస్తున్న ట్రీట్మెంటే ఇవ్వడం ఖాయం.
కానీ వైఎస్ షర్మిలకు కూడా తెలియని ‘రాజకోట రహస్యాలు’ ఆయనకు తెలుసు. కనుక ఆయనపై కత్తి దూయడం చాలా ప్రమాదకరమే.
అందుకే విజయసాయి రెడ్డి ‘నా జోలికి మీరు రావొద్దు. మీ జోలికి నేను రాను’ అన్నట్లు వ్యవసాయం చేసుకుంటానని ముందే హింట్ ఇవ్వడమే కాక నిన్న సోషల్ మీడియాలో నాలుగు ఫోటోలు కూడా పెట్టారు. కానీ ఈ శాంతియుత ఒప్పందానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉండగలవా? యుద్ధం ప్రారంభం కాకుండా ఉంటుందా?అంటే ఇది జగన్, విజయసాయి చేతుల్లో కూడా లేదనే చెప్పొచ్చు. ఎక్కడో ఎప్పుడో ఏదో జరుగవచ్చు. యుద్ధం ప్రారంభం కావచ్చు. అంతవరకు ఆయన వ్యవసాయం చేసుకుంటారు… అంతవరకు జగన్ సిఎం చంద్రబాబు నాయుడు భజన చేసుకుంటారు.




