సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటే కేసులు మాఫీ అవుతాయా?

Vijayasai Reddy preparing organic farming mixture amid political controversy and liquor scam allegations

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ విజయసాయి రెడ్డి ఆ పార్టీలో నంబర్: 2గా ఉండేవారు. కేసులు, అప్పులు, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. ఆ స్థాయిలో ఉన్న ఆయన హటాత్తుగా రాజకీయ సన్యాసం తీసుకొని వ్యవసాయం చేసుకొంటుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

కానీ విజయసాయి రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసు విచారణకు వచ్చిన ప్రతీసారీ జగన్మోహన్ రెడ్డి & కో గురించి మంచి స్పైసీ ముక్కలు నాలుగు చెపుతూనే ఉంటారు.

ADVERTISEMENT

తరచూ ట్విట్టర్‌లో పలకరిస్తూనే ఉంటారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఏవో కబుర్లు చెపుతూనే ఉంటారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో ట్వీట్లు దేనికని సన్నాయి నొక్కులు నొక్కితే ఆయన మనో భావాలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.

కనుక ఇప్పుడా చర్చ పక్కన పెట్టి అచ్చమైన తెలుగులో నేడు వేసిన ఓ ట్వీట్… పెట్టిన వీడియో గురించి రెండు ముక్కలు చెప్పుకొని నేరుగా సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం.

విజయసాయి ట్వీట్‌: సేంద్రీయ వ్యవసాయంలో భూమిలో మిత్ర పురుగులు, ఎర్రలు, వానపాములు, సూక్ష్మజీవులు భూసారం పెంచి పోషకాలతో అధిక దిగుబడి కోసం “జీవామృతం” వాడుతాం. ఆవు పేడ, ఆవు మూత్రం, తాటిబెల్లం, సెనగ కందుల పిండి. పుట్టమట్టి ని సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కర్రతో సవ్యదిశలో రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు తిప్పి తొండుపల్లి వ్యవసాయక్షేత్రంలో జీవామృతం తయారుచేసి చెట్లకు పోస్తాం.

వీడియో: విజయసాయి స్వయంగా ఆ జీవామృతం తయారుచేస్తున్నప్పుడు తీయించుకున్న వీడియో!

ఏపీ లిక్కర్ స్కామ్‌ రూపకర్త ఆయనేనని గుసగుసలు వినిపిస్తుంటాయి. ఆయన ఇంట్లోనే పాత్రధారులతో కలిసి దీనికి రూట్ మ్యాప్, బ్లూ ప్రింట్ తయారుచేశారని వార్తలు వచ్చాయి.

అలాగని తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నవాడిని పట్టుకొని కల్లు తాగుతున్నావంటే మండదా? అలాగే విజయసాయి రెడ్డికి మండుతుంది.

ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందమూ లేదని, దీని కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి అని చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ నాలిక చివరున్న ‘అంతిమ లబ్దిదారు’ పేరు చెప్పడానికి అందరూ భయపడుతున్నట్లే ఆయన కూడా భయపడి ఉంటారు. అందుకే చెప్పలేదు.

కనుక ఈ కేసుతో ఇంత డైరెక్ట్ కనెక్షన్ ఉన్న ఆయన రాజకీయ సన్యాసం తీసుకొని సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటే కేసు మాఫీ అయిపోతుందా? సిట్‌ అధికారులే చెప్పాలి. ఒకవేళ ఇలాంటి వెసులుబాటు ఉంటే మిగిలినవారు కూడా సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటారుగా!

ADVERTISEMENT
Latest Stories