వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల రామ కృష్ణారెడ్డికే అంకితం ఇచ్చారు. ప్యాలస్లో జగన్ పక్కనే ఉంటూ అయన చేసిన నిర్వాకాలను బయటపెట్టారు. సజ్జల గురించి బాగా తెలిసున్నవారికి విజయసాయి రెడ్డి చెప్పినవన్నీ నిజమే అని తెలుసు. కానీ అయన సజ్జల గురించి చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయనీ తెలుసు.
అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపిలో చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండబట్టలేక మీడియా ముందుకు వచ్చి, “మంగళగిరి ప్లీనరీలో విజయసాయి రెడ్డిని సజ్జల కాలర్ పట్టుకొని కొట్టినమాట వాస్తవం. అప్పుడు అక్కడ చాలా మంది వైసీపీ నేతలున్నారు. కనుక ఈ విషయం అందరికీ తెలుసు. కానీ అప్పుడు బయటపడనీయలేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి స్వయంగా బయటపెట్టారు.
ఆయనకు జరిగిన అవమానాల జాబితాలో మరొకటి కూడా ఉంది. అయన తన సొంతూరు తాళ్ళపూడికి వెళ్ళినప్పుడు అదే వాహనంలో ఉన్న సజ్జల నీచాతినీచంగా బూతులు తిట్టారు. అవి నేనే చెప్పలేను కనుక పాపం విజయసాయి రెడ్డి కూడా బయటకు చెప్పుకోలేరు.
అంత మాత్రాన్న విజయసాయి రెడ్డి ఏమీ తక్కువ తినలేదు. ఆయన కూడా సజ్జల కాలర్ పట్టుకున్నారు. నెల్లూరులో ఎంపీగా పోటీ చేసినప్పుడు పార్టీ నేతలతో చాలా దారుణంగా వ్యవహరించారు. ఈవిషయాలు వైసీపీలో చాలా మందికి తెలుసు,” అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
అయితే విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి ఇద్దరూ కూడా తాము చాలా సంస్కారవంతులం, ఆణిముత్యాలం అన్నట్లు మాట్లాడుతుంటారు. అలాంటి ఇద్దరు సంస్కారుల గొప్పదనం ఏమిటో వారి నోటితో వారే చెప్పుకుంటున్నారు.
వారు చెప్పనివాటిని ఇదిగో ఇలా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటివారు బయటపెడుతున్నారు. విజయసాయి రెడ్డి వైసీపీలో తనకు జరిగిన అవమానాలను లెక్కపెట్టుకొని మొత్తం 72గా లెక్క తేల్చారు. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినదానితో కలిపి 73 అయ్యింది.
షర్మిల, సునీతలనే విడిచిపెట్టని కాలకేయ సైన్యం విజయసాయి రెడ్డిని విడిచి పెడుతుందనుకోలేము. కనుక ఇంత వరకు ఒక లెక్క… ఇక నుంచి మరో లెక్క అన్నట్లు ఆ సంఖ్య వేగంగా పెరుగుతుంటుంది. అందుకూ ఆయన సజ్జలని నిందిస్తూ బాధపడటం కంటే, ఇక ఆలస్యం చేయకుండా విజయసాయి రెడ్డి కూడా అర్జెంటుగా సొంత మీడియా, సొంత పార్టీ పెట్టుకుంటేనే బెటర్.







