నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో చోటు చేసుకుంటున్న అక్రమాలు, ఇబ్బందులపై కొన్ని రోజులుగా విద్యార్థులు తమ నిరసనలను తెలుపుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడంపై వర్సిటీ విద్యార్థులు నెల్లూరు నుంచి హైదరాబాద్ కు పాదయాత్రగా వచ్చారు. నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో “కాటమరాయుడు” షూటింగ్ లొకేషన్ లో ఉన్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన విద్యార్థులు తమ సమస్యలను వివరించారు.
వర్సిటీలో జరుగుతోన్న అక్రమాలపై ప్రభుత్వం స్పందించట్లేదని, కాలినడకన హైదరాబాద్ బయలుదేరిన విద్యార్థుల్లో కొందరు విజయవాడలో అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. విద్యార్థుల సమస్యలను విన్న పవన్ కల్యాణ్ చలించిపోయారు. విజయవాడలో మిగిలిపోయిన విద్యార్థులు కూడా హైదరాబాద్ రావాల్సిందిగా పవన్ సూచించారు. సదరు యూనివర్సిటీలోని సమస్యలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని సర్కారుని కోరారు. వర్సిటీ సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ కు పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారు. అక్రమాలపై నిజనిర్దారణ కమిటీ వేయాలని డిమాండ్ చేసిన ఆయన, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని, సమస్యల విషయం ప్రభుత్వం దృష్టికి విద్యార్థులు తీసుకువచ్చినా, ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన ఆయన, ఈ విషయంలో విద్యార్థులకు అన్యాయం జరిగితే, వారి వెనుక తాను అండగా ఉంటానని, వెంటనే వర్శిటీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడాలని గంటాకు సూచించారు.



