గుండె పగిలింది… ఇక నా వల్లకాదు!

Vinesh Phogat Announces Retirement

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తప్పకుండా స్వర్ణ పతకం తెచ్చి పెడుతుందనుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడటంతో ఆమె ఎంతగా కుమిలిపోయి ఉంటారో ఊహించుకోవచ్చు. ఇది ఆమెకు జరిగిన నష్టం కాదు భారత్‌కు జరిగిన నష్టమే అని చెప్పవచ్చు.

ADVERTISEMENT

ఈ పోటీల కోసం బరువు తగ్గించుకునేందుకు నీళ్ళు, ఆహారం కూడా చాలా మితంగా తీసుకుంటూనే, పోటీలో గెలిచేందుకు ఆమె చాలా కటోరంగా శ్రమించారు. ఆ పరిస్థితిలోనే ఆమె ఓటమి ఎరుగని నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ జపాన్ రెజ్లర్ యూయి సుసాకిని ప్రీ-క్వార్టర్స్‌లో ఓడించారు కూడా.

కనుక వినేష్ ఫోగట్‌ ఫైనల్స్‌లో అడుగుపెట్టడంతోనే భారత్‌కు పతకం ఖాయమైపోయింది. కానీ 100 గ్రాములు అధిక బరువు ఉన్నందుకు ఒలింపిక్స్‌ కమిటీ ఆమెపై అనర్హత వేటు వేయడంతో ఆమె గుండె పగిలింది.

ఆ ఆవేదన భరించలేకనే “నాపై కుస్తీ గెలిచింది. మీ కల, నా ధైర్యం చెదిరిపోయాయి. ఇకపై నాకు పోరాడే బలం లేదు. నన్ను క్షమించండి. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024,” అంటూ వినేష్ ఫోగట్‌ ట్వీట్‌ చేశారు.

ఆమెకు ప్రధాని నరేంద్రమోడీ, ఆనంద్ మహీంద్రా, పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సంఘీభావం తెలిపారు. కానీ అవేవీ ఆమె బాధను మరిపించలేవు.

ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం లేదా కనీసం రజతపతకం సాధించి తన కెరీర్‌కు ఓ మరుపురాని ఓ అద్భుతమైన ముగింపు ఇద్దామనుకుంటే, అనర్హత వేటుతో అత్యంత అవమానకరంగా ముగియడం ఆమెను జీవితాంతం వేదిస్తూనే ఉంటుంది.

ఈ అనర్హత వేటు వెనుక ఏమైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఆ చర్చ అనవసరం.

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఆమెపై అనర్హత వేటు పడినందుకు చాలా బాధపడుతూనే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“వినేష్ ఫోగట్‌ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు. ఆమె తప్పకుండా పతకంతో తిరిగి వస్తారనే అందరూ అనుకున్నారు. కానీ ఈవిదంగా జరగడం చాలా బాధాకరం.

నాకు రెజిలింగ్ నిబందనల గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ అయితే చివరిదశలో ఇటువంటి పొరపాటు ఎలా జరిగిందనేది నాకు అర్దం కావడం లేదు. వినేష్ ఫోగట్‌కి ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. కనుక బరువు విషయంలో ఎటువంటి నిబందనలు ఉంటాయో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆమెకు బాగా తెలుసు. పైగా ఆమె వెంట కొంతమంది కోచ్‌లు కూడా ఉన్నారు. వారు ఆమె బరువు, ఆరోగ్యం, ఆహారం, రెజ్లింగ్ ప్రతీ అంశాన్ని నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దుకునేలా శిక్షణ ఇస్తూనే ఉంటారు.

మరి ఇంత అనుభవం, ఇంత మంది కోచ్‌లు ఉన్నా ఈ పొరపాటు ఎలా జరిగిందనేది అర్ధం కావడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఇది వినేష్ ఫోగట్‌కి తగిలిన ఎదురుదెబ్బ కాదు. భారత్‌కు తగిలిన ఎదురుదెబ్బగానే భావిస్తున్నాను. ఆమె వచ్చే ఒలింపిక్స్‌లో పాల్గొని తప్పకుండా మెడల్ సాధిస్తారని ఆశిస్తున్నాను,” అని సైనా నెహ్వాల్ అన్నారు.

ADVERTISEMENT
Latest Stories