పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బుధవారం రాత్రి అందరూ చూస్తుండగా షేక్ జిలానీ అనే వ్యక్తి తన పాత మిత్రుడు షేక్ రషీద్ని కత్తితో నరికి చంపేశారు. వారిరువురూ స్థానిక రౌడీషీటర్ పిఎస్ ఖాన్ అనుచరులే. వైసీపి కోసం పనిచేస్తున్నవారే.
ఇద్దరి మద్య గత కొంతకాలం గొడవలు జరుగుతుండటంతో షేక్ రషీద్పై పగబట్టిన షేక్ జిలానీ నిన్న రాత్రి కత్తితో నరికి చంపాడు. అతను రషీద్ని చేస్తుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులు చాలా మందే ఉన్నారు. వారే పోలీసులకు సమాచారం ఇచ్చి రషీద్ని ఆస్పత్రికి తరలించాడంలో సాయపడ్డారు కూడా. అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో ఈ హత్య ఘటన రికార్డ్ అయ్యింది.
అయితే టిడిపికి చెందినవారే ఈ హత్య చేశారని, నెలరోజుల చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ వైసీపి సొంత మీడియా, దాని సోషల్ మీడియాలో దుష్ప్రచారం ప్రారంభించేసింది.
దీనిపై టిడిపి ఇంకా ఘాటుగా స్పందించింది. “పొద్దున్నే 3 గంటలకు ఫోన్ చేసి బాబాయ్ని లేపించి, చంద్రబాబు చంపాడని పేపర్ లో వేసిన నీచ చరిత్ర వీళ్ళది.. ఏది జరిగినా, ముందు టిడిపి మీద తోసేయటమే. హతుడు, హంతకుడు ఇద్దరూ కూడా వైసీపి వారే… “ ఫోటోతో సహా న్యూస్ పేపర్లో వచ్చిన వార్త క్లిప్పింగ్ ట్యాగ్ చేసింది.
ఈ ఘటనపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు వైసీపి శవరాజకీయాలు చేయడం అలవాటే ఇంకా మానుకోలేదని స్పష్టం అవుతోందని విమర్శిస్తున్నారు.
మరికొందరు వైసీపిలో ఒకరిని మరొకరు చంపుకుంటూ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వాదించడం సిగ్గుచేటని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటువంటి ఘటనలు, ఆరోపణల వలన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అప్రదిష్ట కలుగుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని నిరూపించడానికి వైసీపి ఎంతకైనా తెగించవచ్చు కనుక పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఎన్నికలలో ఘోర పరాజయం కారణంగా ప్రజలకు మొహాలు చూపలేక అవస్థ పడుతున్న వైసీపి, బహుశః ఈ వ్యూహంతో మళ్ళీ ప్రజల మద్యకు వచ్చేందుకు సిద్దం అవుతోందేమో?అనే అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనప్పటికీ వైసీపి ఆరోపణలను టిడిపి ఎప్పటికప్పుడు ఇలాగే బలంగా తిప్పికొడుతూ, పోలీస్ వ్యవస్థని మరింత అప్రమత్తం చేయడం కూడా చాలా అవసరమే.




