విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోతోంది. బేస్ మెంట్లో రెండు అంతస్థులు వాహనాల పార్కింగ్ కోసం, వాటిపైన 9 అంతస్తులలో రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మించబోతోంది. ఇప్పటికే దాని డిజైన్ ఖరారు చేసి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచింది.
కేసీఆర్ హయాంలో సుమారు రూ.650 కోట్లు వ్యయంతో ఏడు అంతస్థులలో వైట్ హౌస్కు తీసిపోని విదంగా మహాద్భుతంగా తెలంగాణ సచివాలయం నిర్మించారు. ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం, ఇతర భవనాలు అన్నీ కలిపి రూ.971 కోట్లు వ్యయంతో నిర్మించారు.
ఇంత పెద్ద కార్యాలయాలు 600-1,000 కోట్ల లోపు నిర్మిస్తే, జగన్ విశాఖలో ఋషికొండపై తన కోసం రూ.500 కోట్ల ప్రజాధనంతో అత్యంత విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం గమనిస్తే, జగన్ ఏ స్థాయిలో ప్రజాధనం దుబారా చేశారో అర్దమవుతుంది.
విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం, తెలంగాణ సచివాలయం, పార్లమెంట్ ఇవన్నీ ప్రభుత్వ కార్యాలయాలే. కానీ వాటికోసం ప్రభుత్వాలు ఆచితూచి ప్రజాధనం ఖర్చు చేయగా, జగన్ తన కోసం ఋషికొండపై నిర్మించుకున్న విలాసవంతమైన భవనాల ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనకాడకుండా రూ.500 కోట్లు ఖర్చు చేసేశారు.
ఇంత ఖర్చు పెట్టి నిర్మించిన ఆ భవనాలను జగన్ వాడుకోలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా వాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. అంటే వాటిపై జగన్ ఖర్చుపెట్టిన రూ.500 కోట్లు వృధాయే.
పేద కుటుంబాలు జీవించేందుకు కేవలం 40 గజాలు చాలనుకున్న జగన్ తన కోసం మాత్రం ఎప్పుడు ఎక్కడైనా ఇటువంటి ప్యాలస్లే నిర్మించుకుంటారు. జగన్ స్థాయి అది. కనుకనే అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వాటిని కట్టించుకున్నారు.
కనుక ఋషికొండ ప్యాలస్లను అలా నిరూపయోగంగా ఉంచేసే బదులు, వాటిని జగన్కే అమ్మేసి వడ్డీతో సహా వసూలు చేస్తే బాగుంటుంది కదా?




