ఎన్నికలలో వైసీపి ఓటమి తర్వాత రాష్ట్రంలో అనేక ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. జగన్ ఆదేశం మేరకు చంద్రబాబు నాయుడుపై అక్రమకేసులు బనాయించిన ఏపీ అడిషనల్ డీజీ సంజయ్, నెలరోజులు సెలవుపై విదేశాలకు వెళ్ళిపోయేందుకు సిద్దపడ్డారు.
జగన్ వీరవిధేయుడుగా పేరు సంపాదించుకున్న సిఎస్ జవహార్ రెడ్డి ఆయనకు సెలవు మంజూరు చేశారు. కానీ గురువారం చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత సంజయ్ సెలవును రద్దు చేశారు. దీంతో సంజయ్ మళ్ళీ డ్యూటీలో చేరక తప్పలేదు.
డిజిపి హరీష్ కుమార్ గుప్తా, వివిద శాఖల ముఖ్య కార్యదర్శులతో సంతోషంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు జవహర్ రెడ్డితో ముభావంగా ఒక్క క్షణం మాత్రమే మాట్లాడి పంపించేశారు. ఆయన ఏదో చెప్పబోతే ‘ఇప్పుడు కాదు ప్రమాణ స్వీకారం తర్వాత’ అని చెప్పి పంపేశారు.
టిడిపి కూటమి గెలిచిన వెంటనే అమరావతిలో సచివాలయంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి ముఖ్యమైన ఫైల్స్ ఏవీ బయటకు పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిజిపి హరీష్ కుమార్ గుప్తాని ఆదేశించిన్నట్లు తెలుస్తోంది.
టిడిపి కూటమి గెలవగానే పార్టీ అభిమానులు డాక్టర్ వైస్సార్ యూనివర్సిటీ పేరుని మళ్ళీ ఎన్టీఆర్గా మార్చారు. విశాఖ సముద్రతీరంలో వైఎస్సార్ వ్యూపాయింట్ని అబ్దుల్ కలాం వ్యూపాయింట్గా పేరు మార్చారు. టిడిపి నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పేర్లు తొలగిస్తూ, జగన్ బొమ్మలు కనపడకుండా కాగితాలు అంటిస్తుంటే, ఇంతకాలం చెలరేగిపోయిన వైసీపి నేతలు నిసహాయంగా చూస్తుండిపోతున్నారు.
విశాఖ రాజధాని పేరుతో ఇంతకాలం చెలరేగిపోయిన వైసీపి నేతలకు వార్నింగ్ ఇస్తున్నట్లు, నగరం నడిబొడ్డున గల ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల తెలుగుతల్లి ఫ్లైఓవర్పై ‘రెడ్ బుక్’ పేరుతో, నారా లోకేష్, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల బొమ్మలు ముద్రించిన ఓ ఫ్లెక్సీ బ్యానర్ వెలిసింది.
ఈ 5 ఏళ్ళ జగన్ పాలనలో తమను వేధించిన, అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపి నేతలు, అధికారులపై తాము అధికారంలోకి రాగానే కటినమైన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ పదేపదే హెచ్చరించేవారు. ఎప్పటికప్పుడు తన ‘రెడ్ డైరీ’లో వారి పేర్లు వ్రాసుకుంటూ ఉండేవారు కూడా.
ఇప్పుడు అదే ‘రెడ్ బుక్’ పేరుతో ఫ్లెక్సీ బ్యానర్ విశాఖలో ప్రత్యక్షమైంది. దానిని టిడిపి నేత అడుసుమిల్లి సురేంద్ర ఏర్పాటు చేశారు. టిడిపి నేతలు, కార్యకర్తలలో ఈ అత్యుత్సాహం చూసి వైసీపి నేతలకు, ఇంతకాలం వారిని వేధించిన అధికారులకు భయాందోళనలు మొదలయ్యే ఉంటాయి. కానీ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం తప్పదు కదా?




