ఎవరైనా ఓ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి కానీ ఆ సమస్యని అందరి దృష్టికి తెచ్చినవారిపైనే చర్యలు తీసుకొంటే?ఇదే జరిగింది ఓ ఉపాధ్యాయుడికి. ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట జెడ్పీ హైస్కూల్లో చాలా సమస్యలున్నాయి.
ఈ విషయం అధికారులకు కూడా తెలుసు. కానీ వారు కూడా నిస్సహాయులే కనుక వారు కూడా తమపై అధికారులకు తెలియజేసి జవాబు కోసం ఎదురుచూస్తుండిపోయారు. ఈలోగా వర్షాకాలం మొదలైపోయింది. దాంతో తరగతి గదులలో పైన రేకుల నుంచి నీరు ధారగా కారసాగింది. తరగతి గదిలోకి నీళ్ళు వచ్చేయడంతో విద్యార్థులు ఆ నీళ్లలోనే బెంచీలపై కూర్చొని ఓ చేత్తో గొడుగులు పట్టుకొని కూర్చొని పాఠాలు వింటున్నారు.
ఆ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఎం.రమేశ్ ఇది చూసి పాఠశాల దుస్థితిని ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్త వైరల్ అయ్యింది. అన్ని ప్రముఖ పత్రికలలో ఆ వార్త వచ్చింది. దాంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. అంటే పాఠశాలకు యుద్ధప్రాతిపదికన మరమత్తులు చేయిస్తోందని కాదు. సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టి ప్రభుత్వం పరువు తీసినందుకు జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు!
వేలకోట్లు ఖర్చుపెట్టి నాడు నేడుతో పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నామని, ట్యాబ్స్ ఇచ్చి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటుంది. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెనలు ఇస్తూ వారికి ఉజ్వల భవిష్యత్ కల్పిస్తున్నామని చెప్పుకొంటారు. తెలంగాణ ప్రభుత్వం చేయలేనివిదంగా ఏపీలో విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోతున్నామని గొప్పలు చెప్పుకొంటారు.
కానీ పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి పడిపోతుంటాయి లేదా ఇలా వర్షం వస్తే కారిపోతుంటాయి. పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని రమేశ్ వంటి ఉపాధ్యాయులు ఈ సమస్యను ఏదోవిదంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని ప్రయత్నిస్తుంటారు. ఇది చాలా సహజం. అటువంటప్పుడు ప్రభుత్వం ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తే ఆయన మాటనును గౌరవించిన్నట్లు ఉండేది. ప్రభుత్వానికి కూడా గౌరవం దక్కేది. కానీ సమస్యని తమ దృష్టికి వచ్చేలా చేసినందుకు ఈవిదంగా చర్యలు తీసుకొని నోరు మూయించే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఇకపై రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయుడు తమ పాఠశాల దుస్థితి గురించి ఎవరికీ చెప్పే సాహసం చేయకపోవచ్చు.
ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడంపై టిడిపి యువనేత నారా లోకేష్ స్పందిస్తూ, “క్లాసురూములో గొడుగులు వేసుకుని పాఠాలు వింటోన్న పిల్లల కష్టాలు వెలుగులోకి తేవడం నేరమా? తరగతి గది పైకప్పు కారకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఆ సమస్యని వెలుగులోకి తెచ్చారని అనుమానిస్తూ టీచర్ని సస్పెండ్ చేసిన తీరు నియంతపాలనకి అద్దం పడుతోంది,” అని ట్వీట్ చేశారు. దాంతోపాటు దీనికి సంబందించిన న్యూస్ క్లిప్పింగ్ ఆ వీడియోలను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.



