వివేకా కాదు… చనిపోయింది సీబీఐ!

Viveka Murder Case

వివేకానంద రెడ్డి దారుణ హత్య జరిగి దాదాపు ఏడేళ్ళు. సీబీఐ విచారణ జరిపినా హంతకులు ఎవరో కనిపెట్టలేకపోయింది..అని అనే కంటే కనిపెట్టదలచుకోలేదు… అని సునీతా రెడ్డి సంచలన ఆరోపణ చేశారు.

సీబీఐ ఈ కేసుని ఎందుకు పక్కదారి పట్టించిందో, దాని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. ఈ కేసు గురించి కనీసం నేను చూపుతున్న ఆసక్తి, అవగాహన కూడా సీబీఐకి లేదన్నారు సునీతా రెడ్డి.

ADVERTISEMENT

ఆ రోజు రాత్రి తన తండ్రి హత్యకు కొన్ని గంటల ముందు నుంచి పోస్టుమార్టం నివేదిక వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ రికార్డులు, వరుసగా జరిగిన పరిణామాలను చూసినా తన తండ్రి హత్య వెనుక ఎవరి హస్తం ఉందో స్పష్టంగా అర్దమవుతుందన్నారు. కానీ సీబీఐకి అర్థం కావడం లేదంటే నమ్మశఖ్యంగా ఉందా? అని ప్రశ్నించారు.

సునీతా రెడ్డి ఈరోజు కడపలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాను చాలా సహనంతో న్యాయం కోసం పోరాడుతున్నా ఫలితం కనిపించడం లేదన్నారు. ఈ కేసు తన సహనాన్ని పరీక్షిస్తున్నా దోషులకు శిక్షలు పడేవరకు పోరాడుతూనే ఉంటానన్నారు.

ఈ కేసులో మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డిని, అయన భార్య భారతీ రెడ్డిని విచారించాల్సిన అవసరం ఉందని కుండబద్దలు కొట్టారు.

ఈ కేసులో సునీతా రెడ్డి సీబీఐని తప్పు పడుతున్నారు. అలాగే ఈ కేసులో నిందితులుగా జైలుకి వెళ్ళివచ్చిన వైసీపీ నేతలు సీబీఐనే తప్పు పడుతున్నారు. చంద్రబాబు నాయుడుతో, సునీతా రెడ్డితో సీబీఐ కుమ్మక్కు అయ్యిందని వారు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ కేసుని తెలివిగా తమ మెడలో వేయాలని ప్రయత్నిస్తుంటే సీబీఐ నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుండిపోయిందని ఇది వరకు సిఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు.

ఓ రాజకీయ ప్రముఖుడి హత్య కేసు విచారణకు వచ్చిన సీబీఐ చివరికి అందరి చేత ఇలా వేలెత్తి చూపించుకునే దుస్థితిలో ఉండటం చూస్తే ఇంతకీ చనిపోయింది వివేకానా లేక సీబీఐనా? అనే సందేహం కలుగుతుంది.

సునీతా రెడ్డి ఆరోపిస్తున్నట్లు కొన్ని రాజకీయ శక్తులు ఈ కేసులో దోషులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని, అవే ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాయని అర్ధమవుతూనే ఉంది. కానీ ఎందుకు? అనే ఆమె ప్రశ్నకు సమాధానం దొరకదు.

ADVERTISEMENT
Latest Stories