వైఎస్ వివేకానండ రెడ్డి హత్య కేసులో ప్రధాన, ప్రత్యక్ష సాక్షి వాచ్ మ్యాన్ రంగన్న (70) బుధవారం రాత్రి కడప రిమ్స్ హాస్పిటల్లో మృతిచెందారు. ఆయన గత కొంతకాలంగా ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులతో చాలా ఇబ్బందిపడుతున్నారు.
పులివెందులలో నివాసం ఉంటున్న ఆయన బుధవారం మద్యాహ్నం ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని చెప్పడంతో, ఆయనకు రక్షణగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్, కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. కానీ బుధవారం రాత్రికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి చనిపోయారు.
రంగన్న మృతిపై తనకు అనుమానాలున్నాయంటూ ఆయన భార్య పిర్యాదు చేయడంతో పులివెందుల పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వివేకా హత్య కేసులో ఇప్పటికే పలువురు సాక్షులు మృతి చెందారు. ఇప్పుడు ప్రధాన ప్రత్యక్ష సాక్షి రంగన్న కూడా మృతి చెందారు.
గత 5 ఏళ్ళుగా ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది. కానీ నేటికీ వివేకాని ఎవరు హత్య చేశారో? ఆయన హత్య వెనుక ఎవరెవరున్నారో సీబీఐ నిర్ధారించి కోర్టులో నిరూపించలేకపోయింది.
ఈలోగా ఇలా ఒకరొకరుగా సాక్షులు చనిపోతూనే ఉన్నారు. మరో 5 ఏళ్ళు విచారణ కొనసాగితే బలమైన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసుని కొట్టివేస్తున్నామని న్యాయస్థానం ప్రకటించినా ఆశ్చర్యం లేదు.
ఇదివరకు జగన్ అధికారంలో ఉన్నారు కనుక ఈ కేసు విచారణ ముందుకు జరగకుండా అడ్డుపడుతున్నారని కూటమి నేతలు ఆరోపించేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివేకా కుమార్తె సునీతా రెడ్డి వచ్చి ఆయనని కలిసి ఈ కేసు విచారణ వేగవంతం చేయించాలని కోరారు. కానీ నేటికీ ఈ కేసు విచారణ నత్తనడకన సాగుతోంది.
అంటే కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు కంటే, 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కలిగి తాడేపల్లి ప్యాలస్లో కూర్చుని ప్రెస్మీట్లు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కువ శక్తివంతుడా?అందుకే ఈ కేసు విచారణ ముందుకు సాగడం లేదా?అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.






