జవహార్ రెడ్డి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కంటే వైసీపి విధేయుడిగానే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు టిడిపి హయాంలో మంచి సమర్ధుడు, వివాదాలకు దూరంగా ఉండే ఐఏఎస్ అధికారిగా మంచి పేరు సంపాదించుకున్న జవహార్ రెడ్డి, జగన్ ప్రభుత్వంలో ఈవిదంగా ఎందుకు మారిపోయారని ఆయన గురించి తెలిసినవారు ఆశ్చర్యపోతుంటారు.
గత ప్రభుత్వంలో మంది పేరు సంపాదించుకున్న జవహార్ రెడ్డి, సిఎస్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైసీపి ప్రధాన కార్యదర్శిలాగే వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి.
జీవో 596ని అడ్డుపెట్టుకొని ఆయన తన కుమారుడు, బినామీల ద్వారా ఉత్తరాంధ్రా జిల్లాలలో సుమారు వేలకోట్లు విలువచేసే సుమారు 800 ఎకరాల అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించాయి.
తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు మూర్తి యాదవ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేకుంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని జవహార్ రెడ్డి హెచ్చరించారు. అయితే ఆయన బెదిరింపులకు తాను భయపడబోనని, ఈ అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఆయనపై చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఆయనకు ఏ అవకతవకలకు పాల్పడక పోయి ఉంటే స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్స్ శాఖ వెబ్సైట్లో సర్టిఫైడ్ కాపీలు, ఈసీల జాబితాని చూపించే కాలమ్స్ అందరికీ కనిపించేలా తెరిపించాలని ప్రతి సవాల్ విసిరారు.
మూర్తి యాదవ్ ఈరోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జవహర్ రెడ్డి బినామీల పేర్లు, భూముల వివరాలు బయటపెట్టారు. ఆయన చెప్పిన దాని ప్రకారం…
· అన్నవరం వద్ద గల ఏ-1 హోటల్ యజమాని చోడ్రాజు సత్యకృష్ణ రాజు, విశాఖలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరిచర్ల శ్రీనివాసరాజు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ సూర్రెడ్డి త్రిలోక్ ముగ్గురూ జవహార్ రెడ్డి బినామీలే.
· అందుకే మే 17న చోడ్రాజు సత్యకృష్ణ రాజు మరణించిన వెంటనే ఇంత ఎన్నికల హడావుడిలో కూడా జవహర్ రెడ్డి హుటాహుటిన అన్నవరం వచ్చారు.
· విశాఖ జిల్లాలోని భీమిలి వద్ద గల పర్యాటక ప్రాధాన్యం కలిగిన ఎర్రమట్టి దిబ్బలు విస్తరించి ఉన్న నేరెళ్లవలస, నిడిగట్టు గ్రామాలలో దళితుల అధీనంలో ఉన్న వందల ఎకరాల భూములను డీపట్టాల ద్వారా తన బినామీ పేరిచర్ల శ్రీనివాసరాజుకి అప్పగించారు.
· విశాఖ జిల్లాలోనే కాపులుప్పాడ, కొమ్మాది, ఎండాడ, విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం చుట్టుపక్కల, ఆనందపురం, పద్మనాభం, పూసపాటిరేగ మండలాలలో వందల ఎకరాలు జవహర్ రెడ్డి బినామీల పేరున ఉన్నాయి.
విశాఖ జిల్లా చుట్టు పక్కల ప్రాంతాలలో దళితులను బెదిరించి, భయపెట్టి బలవంతంగా వారికి చెందిన వందల ఎకరాలను జవహార్ రెడ్డి, ఆయన బినామీలు గుంజుకున్నారని మూర్తి యాదవ్ ఆరోపించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న జవహార్ రెడ్డి రాష్ట్రంలో పేదలకు, దళితులకు రక్షణ కల్పించకపోగా, జీవో 596ని జారీ చేయడం, దానిని అడ్డుపెట్టుకొని దళితులను బెదిరించి భూములు గుంజుకోవడం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మూర్తి యాదవ్ ఆరోపించారు.
ఇటువంటి అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్న జవహర్ రెడ్డి ఆ పదవికి అనర్హుడని, కేంద్ర ఎన్నికల కమీషన్ తక్షణం ఆయనను ఆ పదవిలో నుంచి తొలగించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.




