జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ ప్రభుత్వానికి ఆయనే నోరుజారి బలమైన అస్త్రాన్ని అందించారు. నిన్న ఏలూరు బహిరంగసభలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు బెడిసికొట్టాయి. కొందరు వాలంటీర్లు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, మహిళల కిడ్నాప్ వంటి కొన్ని తీవ్రమైన నేరాలకు కూడా పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ బాగానే అందిపుచ్చుకొంది.
పవన్ కళ్యాణ్ని మూడు పెళ్ళిళ్ళ గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడి విమర్శలు మూటగట్టుకొంటున్న వైసీపీ నేతలకు వాలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ నోరు జారడం కలిసివచ్చిన్నట్లయింది.
వెంటనే మంత్రులు ప్రెస్మీట్లు, కొందరు సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతూ, “ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను అవమానిస్తావా? క్షమాపణ చెప్పాల్సిందే,” అంటూ ఎదురుదాడి ప్రారంభించారు. దానికి కొనసాగింపుగా వాలంటీర్ల చేత పోలీస్ స్టేషన్లలో, రాష్ట్ర మహిళా కమీషన్కు పిర్యాదులు ఇప్పించారు.
వెంటనే మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మావతి కూడా రంగప్రవేశం చేసి పవన్ కళ్యాణ్కు నోటీసులు జారీ చేశారు. తక్షణం వాలంటీర్లకు బహిరంగంగా క్షమాపణలు చెప్పుకోవాలని లేకుంటే తాను చేసిన వ్యాఖ్యలకు సంతృప్తికరమైన సంజాయిషీ ఇవ్వాలని, లేకుంటే చట్టప్రకారం చర్యలు తప్పవని దాని సారాంశం.
వారాహి మొదటి విడతయాత్రలో పవన్ కళ్యాణ్ తన వాదనలతో ప్రజలను ఆకర్షించగలిగారు. వైసీపీని వారి దృష్టిలో దోషిగా నిలబెట్టగలిగారు. కానీ రెండో విడత మొదటిరోజే వైసీపీకి దొరికిపోయారు. రాష్ట్రంలో అక్కడక్కడ కొందరు వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు వార్తలలో వస్తున్న మాట వాస్తవం. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ ఇంకా తీవ్రమైనది. ఈ వివాదం కారణంగా ఎంతో కష్టపడి పెంచుకొన్న ఆయన గ్రాఫ్ హటాత్తుగా పడిపోయే ప్రమాదం పొంచి ఉంది.
ఒకవేళ ఆయన తన ఆరోపణలను నిరూపించగలిగితే అప్పుడు వైసీపీయే మళ్ళీ ఇరుకున పడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ నిరూపించగలరా?లేకుంటే ఈ వివాదం నుంచి ఏవిదంగా బయటపడతారనేది ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనంగా నిలువబోతోంది.



