టిడిపి వినూత్న నిరసనల అంతరార్ధం ఏమిటో?

TDP-Protests-Chandrababu-Naiduటిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని గత నెల 10వ తేదీన అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన తరపు న్యాయవాదులు న్యాయపోరాటాలు చేస్తూనే ఉన్నారు. టిడిపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలుగా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నాయి. కానీ నేటికీ చంద్రబాబు నాయుడుకి జైలు నుంచి విముక్తి లభించలేదు.

ADVERTISEMENT

న్యాయపోరాటాలు ఏదో నాడు తప్పక ఫలించే అవకాశం ఉంటుంది. కానీ నిరసనలు, దీక్షలతో చంద్రబాబు నాయుడుని విడిపించుకోలేమని అందరికీ తెలుసు. అయినప్పటికీ టిడిపి నిరంతరంగా నిరసన దీక్షలు, ర్యాలీలు చేస్తూనే ఉంది.

ఇటీవల కంచాలు, పళ్ళాలతో, ఈలలు వేస్తూ చప్పుళ్ళు చేస్తూ చంద్రబాబు నాయుడుకి సంఘీభావం, జగన్‌ ప్రభుత్వానికి నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చిన టిడిపి, తాజాగా ‘కాంతితో క్రాంతి’ పేరిట మరో వినూత్నమైన నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

రేపు (శనివారం) రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 నిమిషాలపాటు ప్రజలందరూ తమ ఇళ్ళలో లైట్లు ఆర్పి, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి జగన్‌ ప్రభుత్వానికి నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతున్న ‘బాబుతో నేను’ ఆన్‌లైన్‌ ఉద్యమంలో ఆ ఫోటోలను, వీడియోలను షేర్ చేయాలని నారా లోకేష్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

వీటితో టిడిపి ఏమి సాధించాలనుకొంటోంది?అని ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు అరెస్టుకి వ్యతిరేకిస్తూ తాము చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలనుకొంటున్నట్లు అర్దమవుతోంది. తమ పోరాటాలలో వేడి, ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతోందని అర్దమవుతోంది.

చంద్రబాబు నాయుడు విడుదలయ్యే వరకు ఈ వేడిని కొనసాగించగలిగితే అది సానుభూతిగా మరి ఓట్లుగా మారుతుంది కూడా. ఇటువంటి కార్యక్రమాలతో టిడిపి శ్రేణులలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

ముఖ్యంగా ఇదేదో టిడిపి, చంద్రబాబు నాయుడుకి సంబందించిన వ్యవహారమని కాకుండా ప్రజలు ఇది తమ సమస్యే భావించేలా చేయగలిగితే టిడిపి ప్రయత్నాలు ఫలించిన్నట్లే.

ADVERTISEMENT
Latest Stories