కాకినాడ జిల్లా తాళ్ళరేవులో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టిడిపి ఎస్సి సెల్ అధ్యక్షుడు మొర్త భైరవమూర్తి మీడియాతో మాట్లాడుతూ, “వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒకటి రెండూ కాదు… ఏకంగా 27 దళిత సంక్షేమ పథకాలను తొలగించింది. వాటన్నింటిని తక్షణం పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో దళితులకు ఎంతో మేలు చేస్తామని చెపుతున్న వైసీపి పాలనలోనే దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి.
వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద డ్రైవర్గా పనిచేసిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేయడమే ఇందుకు నిదర్శనం. దళితులపై దాడులు చేస్తూ, సంక్షేమ పధకాలను తొలగించి అన్యాయం చేస్తున్న వైసీపీ, తన తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో దళితులు గట్టిగా బుద్దిచెపుతారు,” అని అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి దళిత నాయకులు బుచ్చిబాబు, చెల్లి అశోక్ కుమార్, వెంటపల్లి చిరంజీవి, దాసరి వేణుగోపాల్, మాజీ జడ్పీ సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి, జక్కల ప్రసాద్ బాబు, వెంటపల్లి చంద్రమౌళి, బోయిడి వేణుగోపాల్ శ్రీను, కుమారి, దాసరి వేణుగోపాల్ వెంటపల్లి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.



