టెక్నాలజీ పరంగా సమాజం ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుందని ఆనంద పడాలో, అప్ డేట్ ల మాయలో పడి మానవ సంబంధాలను వదులుకుంటున్నామా అని సిగ్గుపడాలో అర్ధం కానీ దయనీయ పరిస్థితులలో సమాజం ఉన్మాదం చేతిలో బంది అయ్యింది.
రోజు రోజుకి మహిళకు భద్రత కల్పించలేని సమాజాన్ని రూపొందించుకుంటున్నామా అనే మీమాంసలోకి వ్యవస్థలు వెళ్లిపోతున్నాయి. కొత్త చట్టాలను రూపొందిస్తున్న, ఉన్న చట్టాలను బలంగా వినియోగిస్తున్నా ఇంకా మహిళలు మీద లైంగిక దాడులు ఆగడంలేదు.
వరసతో, వయస్సుతో సంబంధం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆడపిల్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే మహిళలుగా జన్మించడం ఇంత పాపమా అనిపించక మానదు.
భద్రత లేని సమాజంలోకి ఆడపిల్లకు జన్మ నివ్వడం తల్లి చేసిన నేరమా? లేక ఆడపిల్లకు భద్రత కలిపించలేని సమాజాన్ని సృష్టిస్తున్న పాశవికుల పాపమా.? తప్పెవరిదైనా శిక్ష మాత్రం అభంశుభం తెలియని బాధితులదే అవుతుంది.
మొన్న నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలిక మీద జరిగిన సంఘటన మరువక ముందే నిన్న విజయనగరం జీలుగువలసలో 5 నెలల ముక్కుపచ్చలారని చిన్నారి పై దారుణం, నేడు చేబ్రోలు కొత్తరెడ్డిపాలెం గ్రామంలో 13 సంవత్సరాల బాలిక మీద హత్యాయత్నం, హత్య. ఇక హైద్రాబాద్ లోని అల్వాల్ సమీపంలో వివాహిత మహిళ పై నిర్భయ తరహా గ్యాంగ్ రేప్.
ఈ సంఘటనలు చూస్తుంటే అసలు ఈ సమాజానికి ఏమయ్యింది అనే ప్రశ్న తలెత్తుంటుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, చట్టాలు మారుతున్నాయి కానీ స్త్రీ తలరాత మారడం లేదు. ఆడపిల్ల అర్ధరాత్రి స్వతంత్రంగా తిరిగిన నాడే దేశానికి నిజమైన స్వతంత్రం అన్న మహాత్ముడి మాటలు ఎప్పటికి వాస్తవ రూపంలోకి రాలేవని తేలిపోయింది.
పట్ఠపగలే ఆడపిల్లలకు భద్రత కరువవుతున్న తరుణంలో ఇక గాంధీజీ కలలు కన్న సమాజం కలగా మిగిలిపోవాల్సిందే. నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకు వచ్చినా నిందుల గుండెలో భయం పుట్టించలేకపోతున్నాయి. మద్యం మత్తులో కొందరు గంజాయి పైత్యంలో మరికొందరు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న బూతు సైట్లకు ఆకర్షితులవుతూ మరికొందరు ఈ దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు.
అయితే వీరి నేరాలను కట్టడి చేయలేక పోతున్న ప్రభుత్వాలను తప్పుబట్టలా? లేక నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించే చట్టాలు రూపొందించడంలో వ్యస్థలు తడబడుతున్నాయా? శిక్షలు వేయడంలో జాప్యం జరుగుతుందా? లేక తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు అవలంభిస్తున్న అలసత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్నారా? నేరస్తులను కాపాడుతున్న వ్యవస్థలను నిందించాలి?
ఈ దేశం ఇంకెన్ని నిర్భయ కేసులు చూడాలి, ఇంకెన్ని దిశా ఘటనలను ఎదుర్కోవాలి ? మహిళ భద్రత ఏ ఒక్కరి బాధ్యతగానో పరిగణించకూడదు. ఇది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి భవిష్యత్తు తరాలకు మహిళల మీద గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత తల్లితండ్రుల నుండి ఉపాధ్యాయుల వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది.
తప్పు జరిగి నిండు ప్రాణం బలైన తరువాత ఎన్ని కాండిల్ ర్యాలీలు చేసిన, ఎన్ని సంతాప సభలు నిర్వహించిన, ఎంత ఏక్సగ్రేషియా అందించిన ఆ తల్లితండ్రుల కన్నిటికి అడ్డుకట్ట వెయ్యలేము. ఆ అబ్దితుల ఆత్మ గౌరవాన్ని తిరిగి ఇప్పించలేము. తప్పు చేసాక కాదు తప్పు చేయడానికి భయపడే చట్టాలు రూపొందించి అమలు చేసిన నాడే ఈ దారుణాలకు ఫుల్ స్టాప్ పెట్టగలం.




