పుష్ప-2లో ముఖ్యమంత్రి అవమానించినప్పుడు పుష్పరాజ్ అహం దెబ్బ తింది. రాజకీయ పరిభాషలో చెప్పుకోవాలంటే మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఆ సినిమాలో ‘తగ్గదేలే..’ అని పదేపదే చెప్పిన పుష్పరాజ్ ఆ సన్నివేశంలో తగ్గాల్సి వచ్చింది.
కానీ అల్లు అర్జున్ నిజజీవితంలో కూడా సరిగ్గా అటువంటి అనుభవమే ఎదుర్కోవలసి రావడం ఆశ్చర్యకరమే.
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అల్లు అర్జున్ మనోభావాలు దెబ్బ తిన్నాయి.. అని నిన్న ప్రెస్మీట్లో స్వయంగా చెప్పారు. సిఎం పేరు ప్రస్తావించలేదు కానీ చెప్పాల్సింది సూటిగానే చెప్పారు. అంటే నిజ జీవితంలో పుష్పరాజ్ ‘తగ్గేదేలే’ అని చెప్పిన్నట్లే భావించవచ్చు.
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక అసలు కారణం ఏమిటి?అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఇప్పుడు దాని గురించి చర్చించుకోవాలంటే అదో పుష్ప-1,2,3 అంత పెద్ద స్టోరీ అవుతుంది. కనుక దానిని పక్కన పెట్టేసి పుష్పరాజ్ ఎందుకు ప్రెస్మీట్ పెట్టాడో మాత్రమే ఆలోచిద్దాం.
సాక్షాత్ సిఎం రేవంత్ రెడ్డి తనని తప్పు పట్టడం అల్లు అర్జున్ అహం దెబ్బ తింది. అందుకే ప్రెస్మీట్ పెట్టి ఖండించారు. యావత్ దేశ ప్రజలు తనని, తన సినిమాని మెచ్చుకుంటుంటే, ప్రభుత్వం తనపై కక్ష కట్టిన్నట్లు వ్యవహరిస్తుండటాన్ని అల్లు అర్జున్ జీర్ణించుకోలేదని ఆయన మాటలలోనే స్పష్టమైంది.
ఈ వేడి చల్లారే వరకు మీడియాకు దూరంగా ఉండాలనుకున్న అల్లు అర్జున్ స్వయంగా నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడటంతో మళ్ళీ ఆయనే మీడియాకు ‘పోషకాహారం’ అందించిన్నట్లయింది. అది వేరే విషయం.
అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు ఇంత రాద్దాంతం జరిగిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్కి సంఘీభావం తెలుపుతారా? అందరూ కలిసి ప్రభుత్వంతో పోరాడేందుకు సాహసిస్తారా? అంటే కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కోసారి వ్యాపారం కోసం మనోభావాలు దెబ్బ తిన్నా భరించక తప్పదు కనుక.
అంటే అల్లు అర్జున్ వెనుక పెద్ద సైన్యమే ఉన్నప్పటికీ అభిమన్యుడిలా ఒంటరిగా పద్మవ్యూహంలోకి వెళ్ళి చిక్కుకుపోయారని చెప్పొచ్చు. కనుక ఈ యుద్ధంలో వీరమరణం పొందాలని అల్లు అర్జున్ కోరుకోరు. కనుక ఇప్పుడు ఆయనకు మెగా సాయం, శ్రీకృష్ణ రాయబారం చాలా అవసరం.




