కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. వాటిని నడిపిస్తున్న పార్టీల తీరు చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో రాజరిక వ్యవస్థ నడుస్తోందని చెప్పకతప్పదు. కేంద్రంలో ఎప్పటికీ మేమే అధికారంలో ఉండాలని బిజెపి కోరుకొంటుంటే, రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కూడా తామే శాస్వితంగా అధికారంలో ఉండాలని కోరుకొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇదెలా సాధ్యం?అంటే సాధ్యమే అంటున్నాయి. అధికారం నిలుపుకోవడం కోసం, ప్రత్యర్ధులను దెబ్బ తీయడం కోసం ఎంత నీచానికైనా సిద్దపడుతున్నాయి.
ఉదాహరణకు ఏపీలో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారం నిలుపుకొనేందుకు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి సంక్షేమ పధకాలను అమలుచేస్తోంది. అయినా నమ్మకం లేకపోవడంతో టిడిపిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తోంది. ఇందుకు తాజా నిదర్శనంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలను అందరూ చూశారు. ఒకప్పుడు మన దేశంలో రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు ఇదేవిదంగా జరుగుతుండేది. మళ్ళీ ఇప్పుడు ఆనాటి రాజరికపు పోకడలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి.
వైసీపీని బలపరుచుకొని, టిడిపిని ఎదుర్కొనే ప్రయత్నంలో ప్రజలను కులాలవారీగా చీల్చి కులరాజకీయాలు చేస్తుండటం, వాటి కోసం రాజధాని అమరావతిని సైతం బలిచేసింది. కొన్ని నెలల క్రితం పచ్చటి కోనసీమలో అంబేడ్కర్ పేరుతో చిచ్చు రగిలిస్తే దానికి వైసీపీ నేతల ఇళ్ళే తగలబడిపోయాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోతునప్పుడు చాలా ఐక్యంగా పోరాటాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు వారిలో వారే పార్టీలు, కులాలు వారీగా చీలిపోయి ఎందుకు కొట్లాడుకొంటున్నారు?అని అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది.
వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకోవడం తప్పు కాదు. అయితే అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేస్తూ, రాష్ట్రాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేసి చూపి ధైర్యంగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలాగా ప్రజలను ఓట్లు అడగవచ్చు. అప్పుడు ప్రజలు కూడా వైసీపీని, సిఎం జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకొనేవారు. నిజానికి తమ ఆకాంక్షలు నెరవేరుస్తాడనే ప్రజలు చంద్రబాబు నాయుడుని, టిడిపిని కాదని, జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ ఛాన్స్ ఎంత గొప్పదో గ్రహించలేకపోతున్నారు. అందుకే రాజరికపు పోకడలతో అధికారం నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
కానీ దేశంలో నేటికీ ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది. కనుక ఇప్పటికైనా మేల్కొని ప్రజల ఆకాంక్షలను అర్దం చేసుకొని పాలన చేస్తే మంచిది లేకుంటే ప్రజలు మరో ఛాన్స్ ఇవ్వకపోవచ్చు.



