వచ్చే శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారం నిలుపుకోవాలని వైసీపీ తహతహలాడుతోంది. ఇది సహజమే. అందుకోసం వైసీపీ రకరకాల వ్యూహాలను అమలుచేస్తోంది. వాటిలో భాగంగానే టిడిపి ముఖ్యనేతలను టార్గెట్ చేసుకొని వారిని ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బ తీసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. టిడిపిని దెబ్బ తీయాలంటే ముందుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయాలని భావించిన సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై దృష్టి పెట్టి, అప్పుడే భరత్ను అభ్యర్ధిగా ప్రకటించేశారు. మూడేళ్ళుగా సంక్షేమ పధకాల గోలే తప్ప ఎన్నడూ అభివృద్ధి గురించి మాట్లాడని సిఎం జగన్ ‘కుప్పం అభివృద్ధి’కి హడావుడిగా 60 కోట్లు నిధులు విడుదల చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా భరత్ పేరు ఖరారు అయినప్పటి నుంచి ఆయన వర్గం కుప్పంలో చాలా రెచ్చిపోతోంది. కుప్పంలో టిడిపి నేతలు, కార్యకర్తలు వైసీపీ నుంచి తీవ్ర ఒత్తిళ్ళు వేధింపులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ టిడిపి శ్రేణులు నిబ్బరంగా నిలబడి ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉన్నాయి. కనుక టిడిపి శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటన పెట్టుకొన్నారు.
తమ కోసం తమ అధినేత వస్తున్నారని తెలియగానే టిడిపి శ్రేణుల్లో మళ్ళీ ఉత్సాహం పొంగిపొరలింది. చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సహజంగానే ఇది వైసీపీకి మింగుడుపడలేదు. అందుకే చంద్రబాబు నాయుడు పర్యటనను రసాభాస చేసి ఆ నేరం ఆయనపైకి, కుప్పం టిడిపిపైకి తోసేయాలని నిర్ణయించుకొన్నాయి.
ముందుగా టిడిపి తోరణాలపై వైసీపీ తోరణాలు కట్టి రెచ్చగొట్టాయి. వారు ఊహించినట్లే టిడిపి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలతో గొడవపడ్డారు. వైసీపీ కోరుకొంటున్నది కూడా ఇదే కనుక టిడిపి కార్యకర్తలతో ఘర్షణ పడి, మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు టిడిపి దాడులను నిరసిస్తూ కుప్పంలో ర్యాలీలు నిర్వహించారు. అక్కడి నుంచి బస్టాండ్ వద్ద టిడిపి నేతలు ఏర్పాటు చేసిన అన్నాక్యాంటీన్పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కుప్పంలో వైసీపీ కార్యకర్తల దౌర్జన్యాలు అన్ని టీవీ ఛానల్స్లో వచ్చాయి కూడా కనుక వాటికి వేరే సాక్ష్యం అక్కరలేదు.
కుప్పంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో, వారి వలన టిడిపి శ్రేణులు ఎంత తీవ్రమైన ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారో చంద్రబాబు నాయుడు స్వయంగా కళ్ళారా చూసిన తర్వాత సహనం కోల్పోయారు. రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. కుప్పం టిడిపి కార్యకర్తలకు అండగా నిలబడతానని, ఇక తరచూ కుప్పంలో పర్యటిస్తానని భరోసా ఇచ్చారు.
పోలీసులతో టిడిపిని అణచివేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే 60 లక్షల మంది టిడిపి కార్యకర్తలతో తిరగబడి గట్టిగా సమాధానం చెపుతామని, చోటామోటా నాయకులను అడ్డుపెట్టుకొని పోరాటం చేయడం కాదు.. దమ్ముంటే సిఎం జగన్మోహన్ రెడ్డి లేదా మంత్రి పెద్దిరెడ్డి రామాచంద్రారెడ్డి వచ్చి తనను ఎదుర్కోవాలని చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. కుప్పంలో వైసీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మపోరాటాలు మొదలుపెట్టాలని చంద్రబాబు నాయుడు టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు.
కుప్పంలో నియోజకవర్గం అభివృద్ధి చేసేందుకు ఎలాగూ వైస్ సిద్దమయింది. కనుక అదేదో పూర్తి చేసి ప్రజలను మెప్పించి గెలవచ్చు కదా?కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తే వైసీపీకి ఎదుకు అంత భయం, ఆందోళన? అసలు ఆయనను ఎందుకు అడ్డుకొంటోంది?చంద్రబాబు నాయుడు ఉండగా కుప్పంలో గెలవలేమనే భయంతోనే కదా? కుప్పంలో వైసీపీ గెలవాలంటే ఇంత నీచ రాజకీయాలు చేయడం అవసరమా?



