జగన్‌ని నమ్ముకుంటే అంతే మరి!

Praveen Prakash Online Meeting with Teachers on 2nd April 2024

జగన్‌ పాలనలో వైసీపి నేతల అండ చూసుకొని పెట్రేగిపోయిన అధికారులు అనేక మందిలో ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకరు. సీఎంవో, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రభుత్వంలో పలు అధికారులను టార్గెట్ చేసుకొని ముప్పతిప్పలు పెట్టారు.

ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా డీఈవొలు మొదలు ఉపాధ్యాయుల వరకు ప్రతీ ఒక్కరినీ వేధిస్తూ, నలుగురిలో అవమానిస్తుండేవారు. అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ప్రతీ విషయంలో వేలుపెడుతూ అందరికీ నరకం చూపేవారు.

ADVERTISEMENT

ఎప్పటికీ తానే అధికారంలో ఉంటానని జగన్‌కు ధీమా ఉంటే ఉండొచ్చు కానీ ప్రవీణ్ ప్రకాష్ వంటి పలు అధికారులకు ఉండటమే విచిత్రం. ఆ ధీమాతోనే వారు చెలరేగిపోయారని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు కూడా. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కన పెట్టిన వారిలో ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకరు.

అప్పటికి గానీ తాను చేసిన తప్పులు తెలిసిరాలేదు. ఒకవేళ పోస్టింగ్ ఇచ్చినా టిడిపి కూటమి ప్రభుత్వంలో తనకు సముచిత గౌరవం, ప్రాధాన్యం రెండూ దక్కవని ఆయనకు అర్దమైంది. అందుకే ఇంకా ఏడేళ్ళు సర్వీసు ఉండగానే జూన్ 25న స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దానిని ప్రభుత్వం వెంటనే ఆమోదించి సెప్టెంబర్‌ 30 నుంచి అమలులోకి వస్తుందని తెలియజేసింది.

కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఆనాడు ఒత్తిడిలో పొరపాటు నిర్ణయం తీసుకున్నానని కనుక తన వీఆర్ఎస్ దరఖాస్తుని పక్కన పెట్టి తనను మళ్ళీ సర్వీసులో తీసుకోవాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

ఈ ప్రయత్నంలో సీఎస్ నీరబ్ కుమార్‌, మంత్రులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు కూడా. కానీ ఎవరూ ఆయనని కలవడానికి ఇష్టపడటం లేదు. సిఎం చంద్రబాబు నాయుడుకి కూడా ఆయన పట్ల సదభిప్రాయం లేదు. కనుక మళ్ళీ సర్వీసులో తీసుకునే అవకాశం లేదనే భావించవచ్చు.

ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేందుకు ఏళ్ళ తరబడి తపస్సు చేసిన్నట్లుగా శ్రమించాల్సి ఉంటుంది. కనుక ఓ ఐఏఎస్ అధికారి సర్వీసులో 7 ఏళ్ళు వదులుకోవలసి రావడం చిన్న విషయమేమీ కాదు. కానీ జగన్‌ని నమ్ముకుంటే ఎంతటివారైనా నష్టపోక తప్పదని, ఏదోరోజు ఇలా మూల్యం చెల్లించక తప్పదని ప్రవీణ్ ప్రకాష్ మరోసారి నిరూపిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories