ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించడం రాష్ట్ర రాజకీయాలలో ‘గేమ్ ఛేంజర్’ అని చెప్పవచ్చు. ఏపీలో రెడ్డి, క్రీస్టియన్ వర్గాల ప్రజలు వైసీపీతో, ముస్లిం మైనార్టీ, కమ్మ, బీసీ సామాజిక వర్గాలు టిడిపితో కొనసాగుతున్నారు. కానీ బిజెపికే ఏ సామాజిక వర్గం మద్దతు లేదు.
ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించడంతో సహజంగానే ఆ వర్గానికి చెందిన ఓటర్లలో చీలికలు రావచ్చు. ఆమె ఎన్టీఆర్ కుమార్తె కనుక ఎన్టీఆర్ అభిమానులలో కూడా చీలికరావచ్చు. అంటే ఆమె రాకతో టిడిపికి ఎంతో కొంత నష్టం జరుగవచ్చన్న మాట!
ఒకవేళ ఆమె జూ.ఎన్టీఆర్ని కూడా పార్టీలోకి రప్పించగలిగితే బిజెపికి సినీ గ్లామర్, దానితో పాటు ఆయన అభిమానుల మద్దతు కూడా లభిస్తుంది.
అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో నేటికీ ఎంత వ్యతిరేకత ఉందో బిజెపి పట్ల కూడా అంతే ఉంది. ప్రత్యేకహోదా వంటి విభజన హామీలు అమలుచేయకపోవడం, అమరావతి, పోలవరం నిర్మాణాలను పట్టించుకోకపోవడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుండటం వంటి అనేక కారణాల చేత బిజెపికి ఏపీలో ఆదరణ లభించడం లేదు. కనుకనే ప్రజలను ఆకర్షించగల పవన్ కళ్యాణ్తో చేతులు కలిపిందని చెప్పవచ్చు. తద్వారా ఏపీలో గౌరవ ప్రదమైన సీట్లు సంపాదించుకోవచ్చని బిజెపి ఆశపడుతోంది.
అయితే దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పుడు జనసేన, టిడిపిలతో ఏవిదంగా వ్యవహరిస్తారనేది చాలా ఆసక్తికరం. నేటికీ జనసేన-బిజెపిల మద్య పొత్తు ఉంది. పవన్ కళ్యాణ్ నిజాయితీగా, హుందాగానే వ్యవహరిస్తారు కనుక ఆ పార్టీతో పొత్తులు కొనసాగించడానికి ఆమెకు అభ్యంతరం ఉండకపోవచ్చు. బిజెపి అధిష్టానం కూడా టిడిపితో పొత్తులకు అయిష్టత చూపుతోంది కనుక ఆమె కూడా టిడిపిని దూరంగానే ఉంచవచ్చు.
దగ్గుబాటి పురందేశ్వరి నియామకంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే లాభపడేది వైసీపీయే. కనుక ఆమె రాకను వైసీపీ స్వాగతించవచ్చు. టిడిపి కూడా ఇటువంటి పరిణామాలకు సిద్దపడే ఉందని మినీ మ్యానిఫెస్టో ప్రకటనతో స్పష్టం చేసింది. కనుక జనసేన కూడా పొత్తుల గురించి స్పష్టత ఇచ్చేస్తే కురుక్షేత్రంలో అడుగుపెట్టడానికి అన్ని పార్టీలు ఆయుధాలు సిద్దం చేసుకోవచ్చు.



