కారణాలు ఏవైతేనేమి, ఈ నెల 24న జగన్ తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలని ఫిక్స్ అయ్యారు. దానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని చెప్పారు.
గత 5 ఏళ్ళలో వివిద అంశాలపై ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపలా, బయటా అనేక పోరాటాలు చేస్తున్నప్పుడు, జగన్ వద్ద 23 మంది ఎంపీలు ఉన్నప్పట్టికీ వాటికి సంఘీభావం ప్రకటించలేదు. కనీసం వాటివైపు తొంగిచూడలేదు. అవి మోడీ ప్రభుత్వంతో పోరాడుతుంటే, వైసీపి ఎంపీలతో మోడీ ప్రభుత్వం అడగకపోయినా మద్దతు ఇస్తుండేవారు. అందుకు ప్రతిగా ఆయనకు ఏమి ప్రయోజనం చేకూరిందో అందరికీ తెలుసు.
ఇప్పటికీ జగన్ మోడీ ప్రభుత్వంతో కనెక్ట్ అయ్యే ఉన్నారు. కనుక జగన్ “ఇప్పుడు నాకు కష్టం వచ్చింది… అందరూ వచ్చి నాకు అండగా నిలబడండి అంటే వస్తారా?”అంటే కాదనే అర్దమవుతోంది. అయినా జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కారు… కనీసం ఆయన వద్ద పట్టుమని పది మంది ఎంపీలు కూడా లేరు.
జగన్ ఏమీ ప్రతిపక్షాలను ఫైవ్ స్టార్ హోటల్లో విందుకి రమ్మనమని ఆహ్వానించడం లేదు. ఆంధ్రాలో తన రాజకీయ అవసరాలు, ప్రయోజనాలు, మైలేజ్ కోసమే ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. దానికి రమ్మనమని జగన్ ఆహ్వానిస్తే ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వస్తాయి? అసలు ఎందుకు రావాలి?అని జగన్ ఆలోచించిన్నట్లు లేదు.
తాను పిలవగానే అన్ని పార్టీలు తోక ఊపుకొంటూ వచ్చేస్తాయనే భ్రమలో ఉన్నారు. అందుకే వాటిని ఆహ్వానిస్తున్నారు. కానీ అవి రాకపోతే నవ్వులపాలడం ఖాయం.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే జగన్ ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. జగన్ మళ్ళీ ప్రత్యేక హోదా పాట అందుకున్నారు. కనుక రాష్ట్రపతి పాలన విధించాలని తన ఎంపీల చేత అడిగించే బదులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగిస్తే కనీసం వారికైనా గౌరవం మిగులుతుంది కదా?




