తెలంగాణ సిఎం ఏ కారణంతో తెలుగు సినీ పరిశ్రమపై ఆగ్రహంగా ఉన్నప్పటికీ దాని వలన తెలంగాణ ప్రభుత్వం, సినీ పరిశ్రమ రెండూ నష్టపోతున్నాయని అర్దమవుతూనే ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో రేవంత్ రెడ్డి చట్ట ప్రకారమే వ్యవహరించినప్పటికీ, సినీ పరిశ్రమతో చాలా కటువుగా వ్యవహరించారని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అందువల్ల సినీ పరిశ్రమ ఆదాయం కోల్పోతోంది. ప్రభుత్వం కూడా సినిమా టికెట్స్ ద్వారా వచ్చే 18 శాతం జీఎస్టీ అదనపు ఆదాయం కోల్పోతోంది. నగరంలో ఒక భారీ సినీ ఈవెంట్ జరిగితే దాని వలన కూడా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వస్తుంటుంది. కానీ తాజా ఆంక్షల కారణంగా ఇప్పుడు ఆ ప్రయోజనం ఏపీకి దక్కుతోంది.
సినీ పరిశ్రమ బంగారు గుడ్లు పెట్టే బాతు వంటిదని కేసీఆర్ గ్రహించారు కనుకనే ఉద్యమ సమయంలో తరిమికొట్టాలనుకున్న దానిని ముఖ్యమంత్రి కాగానే చంక నెక్కించుకొని ఆదరించారు. కానీ రేవంత్ రెడ్డి “నేను ఈ కుర్చీలో కూర్చుని ఉన్నంత వరకు సినీ పరిశ్రమతో ఇలాగే (కటినంగా) వ్యవహరిస్తానని” తేల్చి చెప్పేశారు.
కనుక ఆ బంగారు బాతుని ఏపీకి రప్పించుకోవడానికి ఇదే తగిన సమయమని సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ భావించడం సహజం. శనివారం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా ఇదే.
కానీ అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరాన్ని విడిచి ఇంకా నిర్మాణపనులు కూడా మొదలుకాని ఏపీకి సినీ పరిశ్రమ తరలిరావడం చాలా కష్టమే కానీ… అసంభవం కాదు.
సిఎం, డెప్యూటీ సిఎం, బాలయ్య, నాగబాబు అందరూ కూడా తెలుగు సినీ పరిశ్రమకి సహకరించేందుకు సిద్దంగా ఉన్నారు. ఇప్పుడు ఏపీకి మంచి రోజులు వచ్చాయి. అన్నీ కలిసి వస్తున్నాయి కనుక అందరూ పూనుకొని కలిసికట్టుగా పనిచేస్తే బంగారు బాతు ఏపీకి తప్పకుండా తరలిరాగలదు. ఈ ఏడాదిలోనే మొదటి అడుగు వేయగలదు.




