హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి ఫేస్ ఈ నెల 28న మొదలు కాబోతుంది. మియాపూర్-నాగోల్ స్టేషన్ల మధ్య లైన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆరోజు ఆవిష్కరించనున్నారు. ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు నడుస్తుంది. ప్రజల నుంచి వచ్చే ఆదరణను బట్టి సమయాన్ని పొడిగించే అంశాన్నీ పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్ కే తలమానికంగా మారబోతున్న ఈ మెట్రో రైలును నడిపే బాధ్యతల్ని… ఎక్కువగా మహిళా డ్రైవెర్లే చేపట్టబోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్, ప్రైవేట్ పాట్నర్ షిప్ ప్రాజెక్ట్ అయిన హైదరాబాద్ మెట్రోలో 35 మంది మహిళా లోకో పైలెట్లు రైలును నడపబోతున్నారు. ఇప్పటిదాకా 100 మంది మహిళా లోకో పైలెట్లకు శిక్షణ ఇవ్వగా, వారిలో 35 మంది ఇప్పటికే రైలు ట్రయల్ రన్లో భాగమయ్యారు.
ఏడాదిన్నర కాలంగా వీరందరు ట్రయల్ రన్ లో భాగంగా మెట్రో రైలును నడుపుతున్నారు. వీరిలో చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. తమను తాము నిరూపించుకునేందుకు ఓ మంచి అవకాశం దొరికిందని, ప్రాజెక్టులో తాము కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందని మహిళా లోకో పైలెట్లు చెబుతున్నారు.



