నేటికీ దేశ రాజకీయాలపై పురుషాధిపత్యమే కొనసాగుతోందని చెప్పక తప్పదు. కల్వకుంట్ల కవిత, వైఎస్ షర్మిల, విజయశాంతి వంటి పలువురు మహిళల నాయకుల రాజకీయ ప్రస్తానం చూస్తే ఇది అర్ధమవుతుంది.
విజయశాంతి వంటి సినీ గ్లామర్ ఉన్న మహిళ తెలంగాణ రాజకీయాలలో సొంత పార్టీతో మనుగడ సాగించలేకపోయారు. బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఎదుగుదలకు అవకాశం లభించలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆమె పరిస్థితి అలాగే ఉంది. గట్టిగా కొట్లాడితే కానీ ఎమ్మెల్సీ పదవి లభించలేదు. లభించినా అది అలంకారప్రాయంగానే మిగిలింది. ఓ పురుష ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీకి పార్టీలో, ప్రభుత్వంలో, సమాజంలో లభించే గుర్తింపు, గౌరవం మహిళలకు లభించదనేది చేదు నిజం.
అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల వైసీపీ చెల్లాచెదురు కాకుండా కాపాడి నిలబెట్టి అన్నకు తిరిగి అప్పగించారు. కానీ అదే అన్న కారణంగా ఆమె పార్టీని, రాష్ట్రాన్ని కూడా విడిచిపెట్టక తప్పలేదు. తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకుంటే ఆమె అనేక సమస్యలు, సవాళ్ళు, అవమానాలు భరించినా నిలద్రొక్కుకోలేకపోయారు.
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత వరకు ఆమె అత్యంత శక్తివంతురాలైన నాయకురాలిగానే కనిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత ఆమె పరిస్థితి తారుమారైంది.
తాను సొంత పార్టీలోనే అవమానాలు, కుట్రలు ఎదుర్కోవలసి వచ్చిందని, రాజకీయాలలో ఎవరూ ఎవరికీ స్పేస్ ఇవ్వరని, అడ్డొచ్చినవారిని తొక్కుకుంటూ ముందుకు సాగిపోతుంటారనే చేదు జ్ఞాపకాలను ఆమె స్వయంగా బయటపెట్టారు.
తండ్రి, అన్న నడిపిస్తున్న సొంత పార్టీలోనే ఆమెకు ఇటువంటి దుస్థితి ఎదుర్కోవలసివస్తే, ఇతర పార్టీలలో ఉన్న మహిళల పరిస్థితి ఏవిదంగా ఉంటుంది? అని ఆలోచిస్తే మహిళలు రాజకీయాలలో కొనసాగాలంటే ఎంత కష్టమో అర్ధమవుతుంది.
ఈ ముగ్గురు శక్తివంతమైన మహిళల రాజకీయ ప్రస్తానం, ప్రస్తుత పరిస్థితి, వారి భవిష్యత్తు చూసినట్లయితే పురుషాధిపత్యంలో సాగుతున్న దేశ రాజకీయాలలో మహిళలు నిలద్రొక్కుకోవడం ఎంత కష్టమో అర్ధమవుతుంది.




