సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరియర్ లో వన్ అఫ్ థి బెస్ట్ మూవీ గా నిలిచిన శ్రీమంతుడు చిత్రం అటు చిత్ర నిర్మాతలను శ్రీమంతులను చేస్తే దర్శకుడిని మాత్రం కోర్ట్ కు ఈడ్చింది. మూవీ విడుదలైన నాటి నుంచి ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ పై న్యాయపోరాటం చేస్తూనే వస్తున్నారు శరత్ చంద్ర అనే రచయిత.
ఈ శ్రీమంతుడు సినిమా కథ మొత్తం తానూ రచించిన “చచ్చేంత ప్రేమ” కథేనని దానిలో ఒక్క ఊరు పేరు తప్ప మొత్తం తన కథనే కొరటాల తెరకెక్కించారంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొరటాల పై నాకు న్యాయం కావాలని అంటూ పోరాడుతూనే ఉన్నారు రచయిత శరత్ చంద్ర.
ఈ పోరాటంలో తనకు కాంపన్సేషన్ ఇస్తానంటూ చిత్ర నిర్మాతలు ముందుకొచ్చారని, దానికి అంగీకరించేది లేదని, దర్శకుడు కొరటాల తానూ చేసిన తప్పు అందరి ముందు ఒప్పుకోవాల్సినేదంటూ పట్టుబడుతున్నారు శరత్.
డబ్బు కోసం నేను ఇదంతా చేయడంలేదని, అలా అయితే ఎప్పుడో ఈ సమస్యకు పరిష్కారం దొరికి ఉండేదని, తానూ కేవలం క్రెడిట్ కోసమే ఈ పోరాటాన్ని ఎంచుకున్నానంటూ చెప్పుకొచ్చారు. తనకు రావాల్సిన పేరు ప్రతిష్టలను కొరటాల అన్యాయంగా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొరటాల అందరి ముందు చేసిన తప్పు ఒప్పుకుని ఆ కథ చచ్చేంత ప్రేమ కథే అని ఒప్పుకోవాలి. లేకపోతే జైలుకు వెళ్ళక తప్పదు అంటూ హెచ్చరించారు. అయితే ఆ కాపీ రైట్స్ ఇష్యు లో శ్రీమంతుడు సినిమా హీరో మహేష్ బాబు, మైత్రి మూవీస్ పై కూడా త్వరలో సుప్రీం కోర్టులో కేసు వేస్తానంటూ ముందస్తు హింట్ ఇచ్చారు.
ఇన్నాళ్ల నుంచి ఈ కథ నాది అంటూ రచయిత శరత్ చంద్ర చేస్తున్న పోరాటంలో ‘శ్రీమంతుడు’ నెగ్గుతాడో, ‘చచ్చేంత ప్రేమ’ నెగ్గుతుందో న్యాయస్థానాలే తేల్చాలి.




