జగన్ ప్రభుత్వం వాలంటీర్లందరికీ (సాక్షి) దిన పత్రిక కొనుక్కొనేందుకు నెలకు రూ.200 చొప్పున చెల్లిస్తుండటంపై టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ, “జగన్ ప్రభుత్వం ఇప్పటికే సాక్షి పత్రికకి సంక్షేమ పధకాలు ప్రకటనల పేరుతో ఏడాదికి రూ.280 కోట్ల రూపాయలు ముట్టజెప్పుతోంది. ఇప్పుడు వాలంటీర్లకు ఆ పేపర్ కొనుగోలు చేసేందుకు అంటూ ఒక్కొక్కరికీ నెలకు రూ.200 చొప్పున చెల్లిస్తోంది.
అంటే సాక్షి పత్రికకి ప్రభుత్వం వాలంటీర్ల పేరు చెప్పి నెలకు రూ.5.5 కోట్లు, ఈ లెక్కన ఏడాదికి రూ. 66 కోట్లు ముట్టజెప్పబోతోందన్న మాట! జగన్ ప్రభుత్వం ఈ సొమ్ముని సొంత పత్రికకి ఈవిదంగా మళ్లించుకొంటూ ప్రజాధనాన్ని దోచుకొంటోంది. మీ వాలంటీర్లు అందరూ తప్పనిసరిగా సాక్షి పత్రిక చదవాలని మీరు కోరుకొంటున్నట్లయితే వారికి మీ పత్రికని ఉచితంగా ఇవ్వవచ్చు కదా? రాష్ట్ర ప్రజలు మీ దోపిడీలను గమనిస్తూనే ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చాక మీరు దోచుకొంటున్న ఈ ప్రజాధనాన్ని అంతా కక్కిస్తాము,” అని అన్నారు.
జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను సృష్టించి దాని కోసం ఏడాదికి ఇటువంటి ఖర్చులు అన్ని కలిపి ఏడాదికి రూ.1,898.80 కోట్లు ఖర్చు చేస్తోంది. నిజానికి వారు అందించే సేవలన్నీ ఎప్పటి నుంచో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇదివరకు పింఛన్ కోసం బ్యాంకులకు వెళ్ళవలసివస్తే, ఇప్పుడు వాలంటీర్లు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. ఇటువంటి చిన్న చిన్న సదుపాయాల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.1,898.80 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తోందనే సందేహం కలుగక మానదు.
జగన్ ప్రభుత్వం వాలంటీర్లను పార్టీ ప్రయోజనాల కోసమే వాడుకొంటోందనేది బహిరంగ రహస్యం. సాక్షి పేపరు కొనుగోలుకి వారికి నెలకు రూ.200 చెల్లించడమే ఇందుకు నిదర్శనం. సాక్షి పేపరే ఎందుకంటే, యనమల చెప్పిన్నట్లు ఆ పత్రికకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు, వైసీపీ పధకాలను, వైసీపీ భావజాలాన్ని అర్దం చేసుకొని తదనుగుణంగా పనిచేసేందుకు అని వేరే చెప్పక్కరలేదు.



