పవన్‌ చేయాలనుకొన్నది జగన్‌ చేస్తున్నారు… ఎవరి ఉచ్చులో ఎవరో?

Pawan Kalyan Jaganజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల వారాహి యాత్రలో వాలంటీర్ వ్యవస్థ ముసుగులో జరుగుతున్న అక్రమాలను గట్టిగా నిలదీసి ప్రశ్నించారు.ముఖ్యంగా రాష్ట్రంలో ఒంటరి మహిళలు, వితంతువులు సమాచారం సేకరించి వాటిని సంఘ వ్యతిరేఖ శక్తులకు అందజేస్తుండటంతో రాష్ట్రంలో వేలాది మహిళలు కనబడకుండా పోతున్నారని ఆరోపించారు.

అలాగే వాలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ చేతిలో పెడుతోందని ఆరోపించారు. పవన్‌ కళ్యాణ్‌ ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం చెలరేగింది. ఇదివరకులా వాలంటీర్లు ప్రతీ ఇంటికీ వెళ్ళి చనువుగా పలకరించలేని పరిస్థితి ఏర్పడింది.

ADVERTISEMENT

ముఖ్యంగా వైసీపీకి ఆయువుపట్టు మీద పవన్‌ కళ్యాణ్‌ దెబ్బ కొట్టడంతో ఆ పార్టీ విలవిలలాడుతోంది. వెంటనే తేరుకొని మంత్రులందరూ మూకుమ్మడిగా పవన్‌ కళ్యాణ్‌పై ఎదురుదాడి చేయడం ప్రారంభించారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తన ఆరోపణలను పునరుద్ఘాటిస్తూ, అవసరమైతే వాలంటీర్ వ్యవస్థని సవాలు చేస్తూ కోర్టుకు కూడా వెళతానని హెచ్చరించారు. దీంతో వైసీపీ మరింత కలవరపడింది.

ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు వాలంటీర్ వ్యవస్థపై న్యాయపోరాటం మొదలై ఒకవేళ ఈ వ్యవస్థపై స్టే విధిస్తే? వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇంతకాలం వాలంటీర్ వ్యవస్థ ద్వారానే తన ఓటు బ్యాంకును బలోపేతం చేసుకొంది. ఇప్పుడు ఆ వ్యవస్థ నిలిచిపోతే, సైన్యం లేకుండా యుద్ధరంగంలో ప్రవేశించినట్లవుతుంది.

కనుక వైసీపీ లోతుగా ఆలోచించి పవన్‌ కళ్యాణ్‌ కంటే ముందు తామే కోర్టుకు వెళ్ళి ఆయనపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించింది. తద్వారా వాలంటీర్ వ్యవస్థ అవసరమా… కాదా? దుర్వినియోగం అవుతోందా లేదా?అనే అంశాలపై కోర్టులో వాదోపవాదాలు జరుగకుండా కేవలం పరువునష్టం కేసుకు మాత్రమే విచారణ పరిమితం చేయాలని భావిస్తున్నట్లుంది.

ఈ మేరకు 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పవన్‌ కళ్యాణ్‌పై పరువు నష్టం దావా వేయాలని సిఎస్ అజయ్ జైన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్లుగా పనిచేస్తున్న మహిళలను కించపరచడం, వారి పట్ల విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, వారికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడం తదితర నేరాల కింద పవన్‌ కళ్యాణ్‌పై పరువు నష్టం దావా వేయాలని సూచించారు.

అయితే పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లాలనుకొన్నారు కానీ వెళ్ళి ఉండేవారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వమే స్వయంగా ఆయనను కోర్టుకు రప్పించబోతోంది కనుక వాలంటీర్ వ్యవస్థపై కోర్టులో అసలు సిసలైన పోరాటం మొదలవబోతోందని భావించవచ్చు.

ఒకవేళ వైసీపీ వ్యూహం ఫలిస్తే జనసేనకు కలిగే నష్టం కంటే ఇది బెడిసికొట్టి న్యాయస్థానం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆదేశిస్తే వైసీపీకి జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని వైసీపీ గ్రహించిన్నట్లు లేదు.

ADVERTISEMENT
Latest Stories