వైసీపీ ప్రభుత్వ వైఖరి ఆర్టీసీకి శాపంగా మారింది. నష్టాలలో మునిగిపోతున్న ఆర్టీసీ ఆదాయం సమకూర్చుకొనేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వినియోగించుకోవాలని ఎదురు చూస్తుంటుంది. ఏపీఎస్ ఆర్టీసీకి వచ్చిన ఓ అవకాశాన్ని వైసీపీ ప్రభుత్వ వైఖరి కారణంగా వదులుకోవలసి వస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు ఒంగోలులో మండువారిపాలెంలో మహానాడు సభలు నిర్వహించుకోబోతోంది. కనుక ఆ సభలకు రాష్ట్రం నలుమూలల నుంచి టిడిపి కార్యకర్తలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో ఆర్టీకి భారీగా ఆదాయం వస్తుంది కనుక ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా మొదట సానుకూలంగా స్పందించారు.
కానీ ప్రభుత్వ ఒత్తిళ్ళు కారణంగా ఇప్పుడు మహానాడుకి బస్సులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అయితే అలా చెప్పుకోలేరు కనుక వేసవి సెలవుల రద్దీ ఎక్కువగా ఉన్నందునే మహానాడుకి బస్సులు ఇవ్వలేమని చెపుతున్నారు. మహానాడుకి బస్సులు అద్దెకు ఇస్తే ఆర్టీసీ చాలా ఆదాయం వస్తుందని తెలిసినా ఇవ్వలేమని చెప్పుకోవలసి వస్తోంది.
వైసీపీకి టిడిపితో రాజకీయ శతృత్వం ఉంటే దానిని రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప మద్యలో ఆర్టీసీని బలి చేయడం దేనికి?ఈ విదంగా వ్యవస్థలను, సంస్థలను కూడా రాజకీయాలతో బలి చేస్తుంటే ఇక రాష్ట్రం ఏవిదంగా మనుగడ సాగిస్తుంది? ఏవిదంగా అభివృద్ధి చెందుతుంది?



