వచ్చే మంగళవారం నాటికి ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి, ఏ ప్రభుత్వం ఏర్పడబోతుందో తెలిసిపోనుంది. అయిదేళ్లుగా అధికారం అనుభవిస్తోన్న వైసీపీకి మాత్రం ఇప్పటికే జ్ఞానోదయం అయిపోయినట్లుంది.
పోలింగ్ జరిగిన నాటి నుండి టీడీపీ అధికారంలోకి వచ్చినట్లుగా భావించి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా వ్యాఖ్యలు చేస్తోన్న వైసీపీ అండ్ కో, ఆ దూకుడుని మరింతగా పెంచుతోంది.
తమకు ప్రతిపక్ష హోదా రావడానికి చంద్రబాబే కారణం అన్నట్లుగా సజ్జల బ్యాచ్ మొత్తం మీడియా ముందుకొచ్చి తమ గోడును విలపించుకుంటున్నారు. బహుశా టీడీపీ వర్గీయులు కూడా ఇవ్వలేని ఎలివేషన్స్ ను సజ్జల బ్యాచ్ ఇస్తోంది.
ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమవుతున్న వేళ, ఓటమికి గల కారణాలను ఇప్పటి నుండే ప్రజలకు తెలియచెప్పే విధంగా ముందరి కాళ్ళకు బంధం వేయడంలో వైసీపీ వర్గీయులు నిమగ్నం అవుతున్నారు.
82 శాతం ఓటింగ్ పోలైనపుడు, మా సంక్షేమాన్ని చూసే ప్రజలు ఓట్లు వేశారని చెప్పిన వైసీపీ అండ్ కో, ఓట్ల లెక్కింపు దగ్గరికి వచ్చేపాటికి పోలింగ్ సరిగా జరగలేదని, రీ పోలింగ్ కావాలని డిమాండ్లు చేస్తున్నారు.
అలాగే టీడీపీ వర్గీయులు రీ పోలింగ్ కు ఎందుకు అడగడం లేదని, టీడీపీ ఏం చేయాలో కూడా సజ్జలే చెప్తున్నారు. తన పార్టీలో తాను ఏమి చేయలేకపోతున్నారు కాబట్టి, బహుశా ప్రత్యర్థి పార్టీ ఏం చేయాలో కూడా సజ్జలే చెప్పుకొస్తున్నారు.
మోడీనే మాయ చేయగల శక్తివంతుడు చంద్రబాబు అని చెప్పిన సజ్జల మాటల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు… వైసీపీ ఓటమి వాళ్ళు అంచనా వేసిన దాని కంటే ఘోరంగా ఉండబోతుందని అర్ధమవుతోంది.
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే… 2019లో ఇదే వైసీపీ అండ్ కో, బీజేపీ అండతో అధికారులను మార్చి నాడు అధికారంలోకి వచ్చిన విషయాన్ని మరిచారా? లేక “మనం చేస్తే సంసారం… ” అన్న సామెతను గుర్తు చేస్తున్నారా?
ఇది ఒక్క సజ్జల ఆవేదనే కాదు, పేర్ని నాని కూడా మీడియా ముంగిట వచ్చి, ఓట్ల లెక్కింపు రసాభాసగా మారుతుందని ముందే ఎందుకు చెప్తున్నారు? అసలు రసాభాసా చేసే పార్టీ ఏంటి? అలాంటి ట్రాక్ రికార్డ్ ఏ పార్టీకి ఉంది? అంటే అది అందరికీ తెలిసిందే!
ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి, జగన్ కు ఊడిగం చేస్తున్న పొన్నవోలు నిరంజన్ రెడ్డి కూడా అదే పాటను ఆలపిస్తూ… జగన్ పెద్ద ప్రమాదంలో ఉన్నారని చెప్తూ, వైసీపీ ఓటమినే కాక, ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి ఏమిటో కూడా చెప్పకనే చెప్పారు.




