గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయంపై దాడి కేసుని వైసీపీ స్టైల్లో హ్యాండిల్ చేయబోయి అడ్డంగా బుక్ అయిపోయారు.
ఆయన అనుచరులు 2023, ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసి, బయట పార్క్ చేసున్న కార్లు తగులబెట్టారు. తగులబడిన ఆ కార్లే వల్లభనేని వంశీ నేరానికి అతిపెద్ద సాక్ష్యంగా నిలుస్తున్నాయనే విషయం మారిచినట్లున్నారు.
అందుకే పోలీసులు కేసు నమోదు చేయగానే, వల్లభనేని వంశీ చాలా తెలివిగా పావులు కదుపుతున్నాననుకొని, టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకుపోయి, అక్కడ బెదిరించి భయపెట్టి అతని చేత ఆ కేసు వాపసు తీసుకునేలా చేశారు.
దాంతో టీడీపీ కార్యాలయంపై దాడి కేసు లేకుండా పోతుందని వల్లభనేని వంశీ అనుకున్నారు. కానీ వంశీ ఒకటనుకుంటే జరిగింది మరొకటి!
సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి, బెదిరించి కేసు వాపసు తీసుకునేలా చేసినందుకు పోలీసులు మరో కేసు పెట్టడంతో వల్లభనేని వంశీ అడ్డంగా బుక్ అయిపోయారు.
అంతేకాదు.. అతనిని వంశీ ఎందుకు కిడ్నాప్ చేశారో చెపితే అదే టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకి మరో బలమైన ఆధారంగా మారుతుంది.
ఫిబ్రవరి 13న వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువచ్చారు. అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. హైకోర్టు వరకు వెళ్ళినా బెయిల్ లభించడం లేదు.
ఓ నేరం నుంచి తప్పించుకునేందుకు మరో నేరం చేయడమే తప్పు. కనుక వల్లభనేని వంశీ ఇప్పుడు ఒకటికి బదులు రెండు నేరాలకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఏదో రోజు రెగ్యులర్ బెయిల్ రాక మానదు. వస్తే ఆ తర్వాత ఈ కేసుని ఓ 5-10 ఏళ్ళు లాగించేయడం ఎలాగో వైసీపీ నేతలకంటే ఎవరికి బాగా తెలుసు?




