అన్నా క్యాంటీన్లపై కూడా ఏడుపేనా?

Vijaysai Reddy

జగన్‌ హయంలో రెండు అంశాలు చాలా ప్రస్పుటంగా కనిపించేవి. ఒకటి రాజకీయ కక్ష సాధింపులు. రెండు ప్రచార యావ. వీటి గురించి రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. కనుక మళ్ళీ ఆ సోది అంతా చెప్పుకోనవసరం లేదు.

చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందనే అసూయతో వేలకోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న అమరావతినే జగన్‌ పాడు పెట్టడానికి వెనుకాడలేదు. అలాంటిది… పేద ప్రజలు అన్నం తింటూ చంద్రబాబు నాయుడు పేరు తలుచుకుంటే సహించగలరా?అందుకే అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను మూయించేశారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందనే అసూయతో జగన్‌ చక్కటి అవకాశాలను చాలానే జగన్‌ చేజార్చుకున్నారు. ఆ ఆసూయతో జగన్‌ పైశాచికానందం పొందగలిగారు తప్ప లాభపడింది ఏమీ లేదు.

ఉదాహరణకు అన్నా క్యాంటీన్లను మూసివేసే బదులు తండ్రి వైఎస్ లేదా తన పేరుతో నడిపించి ఉండి ఉంటే జగన్‌కే మంచి పేరు వచ్చేదిగా? కానీ అసూయతో గత ప్రభుత్వం అందించిన మంచి అవకాశాలను జగన్‌ గుర్తించలేక వాటిని చంద్రబాబు నాయుడు కోసం రిజర్వ్ చేసి ఉంచేసి, తాను చెడ్డపేరు సంపాదించుకొని దిగిపోవడం ఖర్మ కాకపోతే మారేమిటి?

అయితే జగన్‌ అసూయ కూడా చంద్రబాబు నాయుడుకి వరంగా మారడం విశేషం. అమరావతి, పోలవరం వంటివి పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు కోసమే విడిచిపెట్టిన్నట్లయింది. వాటిని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు పేరు ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను పునరుద్దరించడంతో అది చూసి వైసీపి నేతలు ఏడుపులు మొదలుపెట్టారు.

వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో సన్నాయి నొక్కులు నొక్కుతూ, “ప్రజలు ముందు పన్ను కట్టాలి. అన్నా క్యాంటీన్లకు విరాళాలు కూడా ఇవ్వాలి. మళ్ళీ అన్నా క్యాంటీన్లలో భోజనానికి డబ్బులు కూడా చెల్లించాలి. ఇదెక్కడి న్యాయం?

ప్రజల డబ్బు చెల్లించి అన్నా క్యాంటీన్లలో భోజనాలు చేస్తూ చంద్రబాబు నాయుడు పోస్టర్లు, ఫోటోలు చూడాల్సిన అవసరం ఏమిటి? ఇది ప్రజాధనంతో టిడిపి ప్రచారం చేసుకోవడం కాదా?” అని ట్వీట్‌ చేశారు.

గత 5 ఏళ్ళలో జగన్‌ ప్రచార యావ ఏ స్థాయిలో సాగిందో అందరూ చూశారు. సంక్షేమ పధకాలకు తన జేబులో డబ్బు తీసి ఇవ్వలేదు. అప్పులు చేసి తెచ్చి పంచిపెట్టారు. మళ్ళీ ఆ భారాన్ని లబ్ధిదారులతో సహా రాష్ట్రంలో ప్రజలందరిపై వేసి ముక్కు పిండి మరీ వసూలు చేశారు. పైగా వందల కోట్లు ఖర్చు చేసి ప్రచారం కూడా చేసుకున్నారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసిన జగన్ బొమ్మలు, వైసీపి రంగులే కనిపించేవి. ఆ ప్రచార యావ చూసి ప్రజలు కూడా విసుగెత్తిపోయారు.

అటువంటి జగన్, విజయసాయి రెడ్డి ఇప్పుడు అన్నా క్యాంటీన్ల నిర్వహణ, రంగులు, సిఎం చంద్రబాబు నాయుడు ఫోటో గురించి మాట్లాడుతుండటం సిగ్గుచేటు కాదా?

ADVERTISEMENT
Latest Stories