రేపటి యుద్ధంలో… కురుక్షేత్రం ఫార్ములాయే!

2024 Elections

ఆనాడు కురుక్షేత్ర మహా సంగ్రామంలో శ్రీకృష్ణుడు ఒక్కడూ పాండవుల వైపు ఉండగా, ఆయన సకల సైన్యాలు కౌరవులవైపు నిలిచి పోరాడాయి. ఇప్పుడు ఏపీ ఎన్నికలలో కూడా ఇంచుమించు అటువంటి పరిస్థితే కనిపిస్తుండటం విశేషం.

గత ఎన్నికలలో వైసీపిని గెలిపించి ముఖ్యమంత్రి కావాలనే జగన్మోహన్‌ రెడ్డి కల నెరవేర్చిన ప్రశాంత్ కిషోర్‌, ఈసారి ఎన్నికలలో వైసీపి ఘోరపరాజయం పొందబోతోందని, ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి తప్పదని తేల్చి చెప్పేస్తున్నారు.

ADVERTISEMENT

కానీ నేటికీ ఆయన ఏర్పాటు చేసిన ‘ఐప్యాక్ దండు’ వైసీపిని గెలిపించేందుకు పని చేస్తూనే ఉంది. దాని నివేదికల ఆధారంగానే జగన్‌ హడావుడిగా అభ్యర్ధులను మార్చుకుంటుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

గత ఎన్నికలలో ఐప్యాక్ అత్యంత నీచమైన ఆలోచనలతో టిడిపిని దెబ్బ తీస్తే, ఈసారి ‘జగన్‌ గెలుపు తధ్యం’ కనుక మితిమీరితే మీకే ప్రమాదమని ప్రజలను తన ముఠాలతో ‘పద్దతిగా హెచ్చరిస్తున్నట్లు’ తెలుస్తోంది. ‘చొక్కా మడత పెట్టి… యుద్ధం, సిద్ధం, 175 సీట్లు గెలుస్తాం’ అని జగన్‌ చెప్పుకోవడానికి బహుశః అర్దం ఇదేనేమో?

కనుక ఈ యుద్ధం టిడిపి, జనసేన-వైసీపికి మద్య మాత్రమే కాదు… ఐప్యాక్ ముఠాకి, ప్రశాంత్ కిషోర్‌కి మద్య జరుగుతున్న నిశబ్ధ యుద్ధంగా కూడా భావించవచ్చు.

ఇక టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు ఖరారు అవడంతో ఈసారి ‘ఢిల్లీ శ్రీకృష్ణుడు’ వాటి వైపు ఉంటాడని తేలిపోయింది. కానీ ఆ శ్రీకృష్ణుడు సైన్యం అంటే ఏపీ బీజేపీలో సోము వీర్రాజు, జీవీఎల్ వంటి పలువురి మనసులు జగన్మోహన్‌ రెడ్డి వద్ద తాక్కట్టులో ఉండిపోయాయనేది బహిరంగ రహస్యమే. కనుక వారందరూ టిడిపి, జనసేనల పక్కనే ఉంటూ, తాము ఓడి జగన్‌ని గెలిపించుకునే ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు.

ఈ శ్రీకృష్ణుడు-సైన్యం-కురుక్షేత్ర యుద్ధం కాన్సెఫ్ట్‌లో వైఎస్ షర్మిల కూడా చక్కగా తన పాత్ర పోషిస్తున్నారని చెప్పక తప్పదు. ఆమె వైసీపి, టిడిపి, జనసేన, బీజేపీ నాలుగు పార్టీలను సమానంగా వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడుతున్నారు. అలా నటిస్తున్నారు కూడా.

కానీ తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి టిడిపి పరోక్షంగా సాయపడింది కనుక అందుకు ప్రతిగా ఇప్పుడు ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో టిడిపికి సాయపడే అవకాశం ఉంది. కానీ టిడిపి ఇప్పుడు కాంగ్రెస్‌ బద్ద విరోధి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కనుక కాంగ్రెస్‌ ఏవిదంగా టిడిపి రుణం తీర్చుకుంటుందో తెలీదు.

కానీ వైఎస్ షర్మిల మాత్రం చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కనుక ఎన్నికల సమయంలో, ఆ తర్వాత కూడా ఆమె ఈ నాలుగు పార్టీలకు దూరంగానే ఉంటారా అంటే కాదనే అందరికీ తెలుసు. మరి ఆమె ఎటువైపు ఉంటారో… కాంగ్రెస్ అధిష్టానం ఎటువైపు ఉంటుందో?చూద్దాం… ఎలాగూ అందరం చొక్కా మడత పెట్టి యుద్ధం సిద్ధం అంటున్నాము కదా… అదీ చూద్దాం!

ADVERTISEMENT
Latest Stories