వైసీపీ గుట్టు కూటమి రట్టు చేస్తే..?

YCP TDP

గండికోట రహస్యాలు మాదిరి కొన్నేళ్ళనుండి బయటకు రాని వైసీపీ రహస్యాలు కేసుల రూపంలో చాలానే దాగివున్నాయి. తనకున్న అధికారంతో ఐదేళ్ల నుండి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరి సాగుతున్న వైసీపీ పార్టీ నేతలకు సంబంధించిన కొన్ని కేసుల గుట్టు కూటమి ప్రభుత్వం బయటపెట్టగలిగితే 11 సీట్లతో ఎగిరెగిరి పడుతున్న వైసీపీ ఒక్కసారిగా ఏపీ రాజకీయాల నుండి కనుమరుగు అయ్యే పరిస్థితి వస్తుంది.

మొదటగా * విశాఖ కోడికత్తి కేసు :

ADVERTISEMENT

అక్టోబర్ 2018 విశాఖ ఎయిర్ పోర్ట్ లో అప్పటి ప్రతిపక్ష నేత వైస్ జగన్ పై కోడికత్తితో శ్రీను అనే దళిత వ్యక్తి దాడి చేసి అరెస్టయ్యారు.

అయితే ఇదంతా తనకు జగన్ మీద ఉన్న అభిమానంతోనే చేసానని, ఇలా చేస్తే నేరం అప్పటి ప్రభుత్వం టీడీపీ మీద పడి జగన్ కు ప్రజలలో సింపతీ వస్తుంది.

కాబట్టి ఏపీ ప్రజలు వైసీపీకి ఓటేసి జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తారనే నమ్మకంతో ఈ సాహసానికి ముందుకు వచ్చానంటూ దాడి నిందితుడు శ్రీను న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు.

అయితే ఈ ఘటన జరిగి ఆరు ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికి ఏ కేసు ఒక కొలిక్కి రాలేదు. రాలేదు అనే కన్నా వైసీపీ రానివ్వలేదు అని చెప్పవచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ కేసును పూర్తిగా విచారించి తెర ముందు కనపడే నిందితులను కాకుండా తెర వెనుక ఆడించే రాజకీయ నాయకులను బయటకు తీసుకురాగలిగితే వైసీపీకి సమాధి కట్టినట్టే.

రెండవది * హూ కిల్డ్ బాబాయ్ :

మార్చి 2019 వైస్ కుటుంబానికి కంచుకోటగా చెప్పబడే పులివెందులలో వైస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య. వేటకొడవ్వలతో, గొడ్డలి వేటుతో అత్యంత పాశవికంగా ఆయన సొంత ఇంటిలోనే ఆయనకు నరికి చంపారు.

అయితే ఇంతటి ఘోరమైన హత్యను గుండెపోటుగా ప్రచారం చేసింది జగన్ సాక్షి. మరి ఆ తరువాత ఎవరి సలహా మేరకు జగన్ దీనిని రాజకీయ హత్యగా మార్చారో ఇప్పటికి రహస్యంగానే మిగిలిపోయింది.

అయితే ఈ హత్య కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరగడంతో దీని కూడా తన పార్టీ గెలుపు కోసం వాడుకున్నారు జగన్. నేరం టీడీపీ మీద వేసి నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు ప్రచురించి సిబిఐ ఎంక్వయరీ అంటూ హడావుడి చేసారు.

2019 తానూ అధికారంలోకి రాగానే వివేకా హత్యను భద్రంగా లాఖరులో దాచి బాధితులనే నిందితులుగా చేసి హత్య ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డికి కొమ్ముకాశారు. 2014 ఎన్నికల ప్రచారంలో ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ బాబు వేసిన ప్రశ్నకు నేడు సమాధానము చెప్పగలిగితే వైసీపీ పునాదులు కదలడం కాయం.

మూడవది * జగన్ గులకరాయి కేసు :

2019 లో వైసీపీ వేసిన ఎన్నికల పాచికలన్నీ పారడంతో అదే పంథాలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి జగన్ ఈ గులకరాయి డ్రామా ఆడారు అంటూ టీడీపీ, జనసేనలు వైసీపీ పై గట్టిగా ఎదురుదాడి చేసారు.

టీడీపీ, జనసేన చేసిన ఆరోపణలను డిఫెండ్ చేసుకోవడంలో ఈసారి వైసీపీ ఫెయిల్ అయ్యింది. దాని ఫలితమే వైసీపీ వై నాట్ 175 నుండి 11 పరిమితమయ్యింది.

జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ను హత్య చేయడానికి మళ్ళీ ఒక దళిత మైనర్ బాలుడు ప్రయత్నించాడు అంటూ సతీష్ అనే వ్యక్తిని జైలుకు పంపించారు.

గులకరాయితో ఒక వ్యక్తిని చంపడం అనేది ఎంతవరకు ఆచరణ సాధ్యమనేది వైసీపీ నేతలే చెప్పాలి. అయితే అసలు జగన్ పై దాడి జరిగిందా లేదా అన్నది ఇప్పటికే అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.

కూటమి ప్రభుత్వం ఈ మూడు ప్రశ్నలకు అటు ఏపీ ప్రజలతో పాటు ఇటు వైసీపీ నేతలకు కూడా సమాధానం చెప్పగలిగితే పవన్ చెప్పినట్లు మూడడుగులతో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన వామనుడి మాదిరి వైసీపీని కూటమి ప్రభుత్వం మూడు ప్రశ్నల సమాధానముతో రాజకీయ సమాధి చేయగలదు.

ADVERTISEMENT
Latest Stories