రెండు తెలుగు రాష్ట్రాలలో వేమన కవి గురించి తెలియనివారుండరు. సామాన్య ప్రజలకు కూడా అర్దమయ్యే విదంగా, ఆలోచింపజేసే విదంగా లోకరీతులను వివరిస్తూ తేట తెలుగులో ఆయన రాసిన పద్యాలలో ఒక్కటైన రాని తెలుగువారుండరు. ఆయన అంత గొప్ప కవి కనుకనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన పేరిట 2006లో కడప జిల్లాలో వేమన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ విశ్వవిద్యాలయం ఆవరణలో ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసారు.
అయితే ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు సిఎం జగన్మోహన్ రెడ్డే యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో తన తండ్రి విగ్రహం పెట్టించారు. విద్యార్ధి సంఘాలు, సాహితీ ప్రేమికులు, రచయితలు వేమన విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణం మళ్ళీ అక్కడ వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లేకుంటే గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ను కలిసి ఫిర్యాదు చేస్తామని రాయలసీమ విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి మల్లెల జగదీశ్ తదితర విద్యా సంఘం నేతలు చెప్పారు.
దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందిస్తూ, రెండు సందర్భోచితమైన వేమన పద్యాలను తాత్పర్యంతో సహా పెట్టారు.
పద్యం: విద్యలేనివాడు విద్వాంసుచేరువ నుండగానే పండితుండుగాడు కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం.
పద్యం: ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు? విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విష వృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి.దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగ-పడడు,అంతేకాదు హాని కూడా చేస్తాడు.




