2014 ఎన్నికలలో వైసీపీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచార బరిలో దిగిన వైస్ కుటుంబం, వైస్ జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేయడమే ప్రధమ కర్తవ్యంగా పని చేసారు. అయినా ఆశించిన ఫలితాలు రాకపోవడం తో పాటుగా వైస్ జగన్ తన అక్రమాస్తుల కేసుల విషయంలో అరెస్టయ్యి దాదాపు 16 నెలలు జైలు జీవితం అనుభవించారు.
అయితే ఆ సమయంలో వైసీపీ బరువు, బాధ్యతలు చేతపట్టిన తల్లి వైస్ విజయలక్ష్మి, చెల్లి వైస్ షర్మిల తమ సమకాలీన రాజకీయంతో వైసీపీని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లగలిగారు. అలాగే ‘అన్న వదిలిన బాణం’ అంటూ వైస్ షర్మిల తన పాదయాత్రతో, అన్న వదిలిన ఓదార్పు యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 వేల కి.మీ పైచిలుక పాదయాత్ర చేసి కొత్త రికార్డు ను సృష్టించారు.
అన్న ను ముఖ్యమంత్రిని చేయడానికి, వైసీపీ ని అధికారంలోకి తీసుకురావడానికి ఎండనకా, వాననకా, రేయనక, పగలనక కాలికి చక్రాలు కట్టుకుని, గొంతుకకు మైకు పెట్టుకుని తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మరి కష్టపడ్డారు షర్మిల. అలాగే ఆరు పదుల వయస్సులో, ఎటువంటి రాజకీయ పరిజ్ఞానం లేకుండా, కేవలం వైస్ రాజశేఖర్ రెడ్డి భార్య అనే ఛరిష్మాతో తన కొడుకుని సీఎం గా చూడడానికి వైస్ విజయలక్ష్మి నా బిడ్డకు ఒక్క అవకాశం అంటూ అప్ ప్రజల ముందు కొంగు పట్టారు.
ఇలా వైస్ జగన్ కోసం ఆయన స్థాపించిన వైసీపీ పార్టీ కోసం తన వయస్సుని కూడా పక్కన పెట్టి తల్లి విజయలక్ష్మి ముందుకొచ్చింది, తన కుటుంబానికి కూడా దూరమై చెల్లి షర్మిల అన్నకు తోడుగా నిలిచింది. మరి జగన్ కోసం తల్లి, చెల్లి చూపిన ఆనాటి ప్రేమలు, ఆప్యాయతలు ఇప్పుడు ఏమయ్యాయో.? వైసీపీ గెలుపు కోసం వారు చేసిన ప్రచారాలు ఎటుపోయాయో.?
పార్టీలో ఎటువంటి గుర్తింపు కోరుకోకుండా, ప్రభుత్వంలో ఏ పదవి ఆశించకుండా జగన్ పదవి కోసం, వైసీపీ గెలుపు కోసం ఇంత చేసిన విజయమ్మ, షర్మిల కు చివరికి జగన్ నుంచి దక్కిందేమిటి.? తన ఆస్తిని అక్రమంగా తల్లి, చెల్లి కలిసి దోచేస్తున్నారు అనే అపవాదు కు తోడు తల్లికి, చెల్లికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు, సాక్షిలో కథనాలు …ఇలా ఇప్పుడు వైస్ కుటుంబంలో ఆస్తుల తగాదాలతో జగన్, షర్మిల, విజయలక్ష్మి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కారు.
సరస్వతి పవర్ ప్లాంట్ కు సంబంధించిన భూముల విషయంలో వీరి మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి వైసీపీ పతనం వైపు సాగుతున్నాయి. తల్లి తనను మోసం చేసి తనకు, తన కుటుంబానికి చెందవలసిన ఆస్తులను అక్రమంగా చెల్లి షర్మిలకు బదలాయిస్తుంది అంటూ జగన్ న్యాయస్థానం ఎదుట చేస్తున్న ఆరోపణలు, నా భర్త ఆస్తులను తన కొడుకు జగన్, కోడలు భారతి అన్యాయంగా తనవద్ద నుండి లాక్కుకోవాలని చూస్తున్నారని విజయలక్ష్మి కోర్టుకి చేస్తున్న విన్నపాలు,
తనకు తన తండ్రి వారసత్వంగా దక్కాల్సిన హక్కుని అన్న జగన్ తనకు దక్కకుండా చేస్తున్నారు అంటూ షర్మిల వేస్తున్న నిందలు చూస్తుంటే ఆనాటి ప్రేమలు…ఆప్యాయతలు ఎటుపోయాయో అంటూ వైస్సార్ అభిమానులు ఉసూరుమంటున్నారు. నాడు అన్న గెలుపు కోసం తాపత్రయపడిన చెల్లి నేడు అన్న పతనమే కోసం పట్టుబట్టారు.
నాడు కొడుకు పదవి కోసం కొంగు చాపిన తల్లి నేడు తన హక్కు కోసం కొంగు ముడిపెట్టి పోరాడుతుంది. అలాగే నాడు తల్లి, చెల్లి తన ప్రాణం అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ నేడు అదే తల్లిని, చెల్లిని తన రాజకీయ అధికారంతో రాష్ట్రం దాటించారు, అలాగే తనకునన్ ఆర్థిక బలంతో కోర్టులకు ఈడ్చారు.




