“హోదా” రాజకీయం…ఇక మొదలెడదామా.?

jagan meeting today

ప్రత్యేక హోదా ప్రతిపక్షాల పాలిట బ్రహ్మాస్త్రంగా అధికార పార్టీ పాలిట శాపంలా మారిందనే చెప్పాలి. అయితే ప్రజలకు మాత్రం ఈ ప్రత్యేక హోదా అనేది అర్ధం కానీ ఒక బ్రహ్మ పదార్థమే అవుతుంది. అటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైస్ షర్మిల మొదలుకుని వైస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైస్ జగన్ వరకు ఈ ప్రత్యేక హోదా అంశంతోనే ఈ ఐదేళ్లు ప్రజల కళ్ళు కప్పాలని ఆశపడుతున్నారు.

2014 ఎన్నికల తరువాత ప్రతిపక్షానికే పరిమితమైన జగన్ ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్నారు. అయితే అదే 2019 వైసీపీ ఎన్నికల నినాదంగా ముందుకెళ్లిన జగన్ రాష్ట్రానికి హోదా సాధించలేదు కానీ తనకు, తన పార్టీకి మాత్రం ప్రతిపక్షం నుండి అధికార పక్షం అనే హోదాను దక్కించుకున్నారు. అయితే 2024 లో వైసీపీ 11 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితమవవడంతో మళ్ళీ ప్రత్యేక హోదా నినాదం తెర మీదకు తెచ్చారు జగన్.

ADVERTISEMENT

జగన్ వాదనకు ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఊతమిచ్చారు. నితీష్ తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి బీహార్ అసెంబ్లీ నుండి తీర్మానం చేసి పంపారు. దీనితో జగన్ మళ్ళీ తానూ ప్రజలలోకి వెళ్ళడానికి అవకాశం చిక్కింది అనే ఉద్దేశంతో హోదా రాజకీయం మొదలుపెట్టడానికి కావాల్సిన అన్ని అస్త్రాలను శోధిస్తున్నారు.

టీడీపీ కూటమి బలంతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి టీడీపీ అధినేత బాబు కూడా నితీష్ మాదిరే ఏపీకి ప్రత్యేక హోదా కోసం మోడీని డిమాండ్ చేయాలంటూ వైసీపీ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. తానూ అధికారంలో ఉన్న ఐదేళ్లు చేయలేని పనిని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఐదు వారాలకే పూర్తి చేసేయాలి అంటూ పోస్టులు పెట్టడం వైసీపీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.

అయితే 2024 ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూటమి నేతలు ఎక్కడా మా కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తాం అంటూ హామీ ఇవ్వలేదు. గతంలో కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తాం అంటూ బీరాలు పోయిన వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎవరి మెడలు వంచిందో ఇప్పటికి చెప్పలేని పరిస్థితి. ప్రతిపక్షంలోకి రాగానే హోదా మాటున రాజకీయ చిచ్చు రాజేస్తూ కాలం వెళ్ళబుచ్చడం జగన్ కు అలవాటుగా మారిపోయినట్టుంది.

నమ్మి ఓటేసిన ప్రజలను వంచన చేసి తమ కేసుల కోసం ఐదేళ్లు హోదాను తాకట్టుపెట్టిన జగన్ ఇప్పుడు హోదా కోసం ప్రవచనాలు చెపుతుంటే వినడానికి, నమ్మడానికి ఏపీ ప్రజలంతా వైసీపీ కార్యకర్తలు కాదనే సత్యాన్ని జగన్ ఇప్పటికైనా గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్రాన్ని కాదని అడుగు ముందుకు వేసే పరిస్థితులలో లేదు. వైసీపీ ప్రభుత్వంలో గత ఐదేళ్లుగా రాష్ట్రం విభజన కన్నా ఎక్కువగా నష్టాన్ని కళ్ళ చూసింది.

ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకుంటే నష్ట పోయేది రాష్ట్ర భవిష్యత్తే. కేంద్ర ప్రభుత్వంతో సామరస్యంగా ఉంటూనే రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన అన్నింటిని సాధించుకోగలగాలి. బాబు గతంలో మాదిరి వైసీపీ ట్రాప్ లో చిక్కుకుని బీజేపీ తో యుద్ధం చేసే అవకాశం ఇప్పుడు లేదు. ఒకపక్క వైసీపీ మాత్రం అడగకుండానే బీజేపీ కి అన్నివిధాలా విధేయులుగా అంటూ మరోపక్క టీడీపీ, జనసేనలను బీజేపీ పై యుద్దానికి రెచ్చకొడుతుంది.

జగన్ ఇప్పటికైనా అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ మాదిరి అదే స్క్రిప్ట్ తో రాజకీయాలు చేస్తే ఈసారి మోసపోవడానికి ప్రజలు కానీ ట్రాప్ లో పడడానికి ప్రత్యర్థి పార్టీలు కానీ సిద్ధంగా లేవు అనేది జగన్ గ్రహించాలి. ఒకపక్క తనకు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలంటూ రాష్ట్ర అసెంబ్లీలో గొడవ…మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో రగడ …ఇలా వైసీపీ “హోదా” రాజకీయాలు మొదలుపెట్టింది.

ADVERTISEMENT
Latest Stories