నోయిడాలో ఎన్నోరోజులు ఎంతో మంది కష్టపడి, శ్రమించి, ఎంతో ధనం వెచ్చించి నిర్మించిన ట్విన్ టవర్స్ భవనాలను తొమ్మిది సెకన్ల వ్యవధిలో ఒక్క బటన్ నొక్కి నేలకూల్చారు అధికారులు. ఇందులో ఆలోచించాల్సిన అంశాలు రెండు. ఒకటి అక్రమ మార్గంలో తాత్కాలికంగా ముందుకెళ్లిన ఏదోరోజు నెలకొరగక తప్పదు అనేది., మరొకటి ఇలా బటన్ నొక్కుడు కార్యక్రమాలు చేస్తే ఎప్పటికైనా పతనం కాయం అనేది .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం బాగా ప్రసిద్ధి చెందింది. అధికార వైసీపీకి ప్రచారంగాను…, ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రం గాను.., ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం నిత్యం వార్తలలో నిలుస్తుంది. స్వయానా ముఖ్యమంత్రే నేను బటన్ మాత్రమే నొక్కగలను.., ఆపై మిగతావన్నీ మీరే చూసుకోవాలి అంటూ ఆపార్టీ నేతలకు బహిరంగ సభలలోనే ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో బహిరంగ సభ నిర్వహించి కొన్ని కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఈ బటన్ నొక్కుడు కార్యక్రమంలో ప్రజలకు ఉచిత పధకాల రూపంలో పంచుకుంటూ పోతున్నారు. “కూర్చోని తింటే కొండలైన కరిగిపోక తప్పదు” అంటూ పెద్దలు చెప్పిన సామెత మాదిరి ఇలా రాష్ట్ర ఖజానా మొత్తాన్ని సంక్షేమం పేరుతో పంచుకుంటూ పొతే భవిష్యత్ తరాల వారికి అప్పుల తిప్పలు తప్పవనేది వాస్తవం.
అయినా..,ఈ మాదిరి బటన్ నొక్కడానికి ఇంత మంది యంత్రంగం .., ఇంత మంది సలహాదారులు., ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు., మంత్రులు..,వారికి సిబ్బంది ఇలా ఎంత ప్రజా ధనం ఖర్చుల రూపంలో వృధా అవుతుందో అంటూ సామాన్య మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 151మంది ఎమ్మెల్యే లను ఇచ్చింది ఇలా సంక్షేమం పేరుతో వినాశనం చేయడానికైనా అంటూ ఓవర్గం ప్రజలు ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారు.
ఏంతో మంది మధ్యతరగతి ప్రజలు తమ అవసరాలను త్యాగం చేసి ప్రభుత్వం విధించే అదనపు పన్నుల భారాన్ని మోస్తూ…, వారి కష్టార్జితంతో రాష్ట్ర ఖజానాను నింపుతారు. అది రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడితే తద్వారా తమ భావితరం భవిష్యత్ కు ఉపయోగపడుతుందనేది వారి ఆశ. అయితే ఈబటన్ నొక్కడం ద్వారా రోజురోజుకి రాష్ట్ర ఖజానా పై ఆర్ధిక భారం పెరిగిపోయి అప్పులభారం అధికమవుతుంది అంటూ ఆర్ధిక నిపుణులు సైతం ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నాయి.
ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీనియర్ రాజకీయ నాయకులు సైతం జగన్ వైకరిని తప్పుబడుతున్నారు. ఇలా పంచుకంటూ పొతే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక మాదిరి తయారవుతుందని ప్రభుత్వం పై విమర్శలవెల్లువే కురుస్తుంది. అయినా ఇవేమి పట్టనట్టు జగన్ బటన్ నొక్కడం మీదే తన ఆసక్తిని కనపరచడం చూస్తుంటే ఎదోఒకరోజు జగన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థను ట్విన్ టవర్స్ మాదిరి ఒక్కసారిగా నేలకూలుస్తారా…? అన్న సందేహాలు ఇప్పుడు ప్రజలలో సైతం పుట్టుకొస్తున్నాయి.
వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ రాజు ఏకంగా ముఖ్యమంత్రి జగన్ ను “బటన్ రెడ్డి” అంటూ సంబోధించడం చూస్తుంటే ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం జగన్ ప్రభుత్వానికి ఆక్సిజన్ లా పనిచేస్తుందేమో అనక తప్పదు. అతిగా వాడేస్తే కొంత కాలానికి ఆ ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితికి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రన్ని తీసుకువెళ్తుందనే ఆవేదన కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. “పెరుగుట విరుగుట కొరకే”…, అన్న సామెత జగన్ గుర్తుంచుకుంటే ఇప్పటికైనా ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలను పెంచకుండా ఉంటారేమో.



